మేమొచ్చినంకే బ్రాహ్మణులకు మేలు జరిగింది
టీఆర్ఎస్ పాలనలోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల మాదిరిగానే బ్రాహ్మణుల శ్రేయస్సుకు రూ. 100 కోట్ల నిధితో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మంగళవారం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ఆఫీస్ లో తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలోగాడిచెర్ల నాగేశ్వర రావు సిద్ధాంతి రచించిన నవతివర్ష (90) శ్రీ శార్వరి పంచాంగాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. బ్రాహ్మణులకు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే మేలు జరిగిందన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాల అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుంది ఒక్క టీఆర్ఎస్ సర్కారేనన్నారు. తెలంగాణ వచ్చాక పండితులు, సిద్ధాంతులు కలిసి తెలంగాణ విద్వత్సభ ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామమని చెప్పారు. ఈ ఏడాది జులై 11,12 న జరిగే నాల్గవ రాష్ట్ర స్థాయి జ్యోతిష్య మహాసభలకు ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి పాల్గొన్నారు.