హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని నాగోల్- ఆనంద్ నగర్ రోడ్డు గుంతలమయం కావడంతో ఓ మహిళ నిరసనకు దిగింది. రోడ్డుపై ఉన్న బురదలో కూర్చొని నిరసనకు దిగింది.
నాగోల్ నుండి తట్టి అన్నారం వైపు వెళ్లే రోడ్డు గుంతల మయం అయ్యింది. కుంట్లూర్ కు చెందిన నిహారిక నాగోల్ నుండి కుంట్లూర్ కు రోజు జర్నీ చేస్తుంది. వాళ్ల పిల్లలు కూడా ఇదే దారిలో రోజు స్కూల్ కు వెళ్తుంటారు. గతంలో ఈమె పిల్లలు ఈ రోడ్డు నుండి వెళ్తు కింద పడ్డారు. అయితే ఆ సమయంలోనే అధికారులకు ఆమె ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆనంద్ నగర్ చౌరస్తాలోని గుంతలో కూర్చొని ఇవాళ నిరసన తెలిపింది.
ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె.. రోడ్డు మొత్తం గుంతల మయంగా మారి వర్షం నీరు చేరి అవస్థలు పడుతున్నామన ఆవేదన వ్యక్తం చేసింది. గుంతల్లో పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని మండిపడ్డారు. గ్రేటర్ పరిధిలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందని.. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ యంత్రాంగం స్పందించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
తాము ట్యాక్స్ లు కడుతున్నాం.. మాకు సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సమస్యను త్వరలో పరిష్కరించకపోతే ఇదే గుంతలో పెద్ద ఎత్తున నిరసనకు దిగుతామని హెచ్చరించింది. దీంతో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమీషనర్ ఆమెతో ఫోన్ లో మాట్లాడి త్వరలో ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. దీంతో ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది.