ఆమె మృతికి వ్యాక్సిన్ కారణం కాదు: హెల్త్ డైరెక్టర్

ఆమె మృతికి వ్యాక్సిన్ కారణం కాదు: హెల్త్ డైరెక్టర్

మంచిర్యాల: ఇటీవ‌ల‌ మంచిర్యాలలో మ‌ర‌ణించిన‌ హెల్త్ వర్కర్ సుశీల మృతికి వ్యాక్సిన్ కారణం కాదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు ప్రకటించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన సుశీల అనే అంగన్ వాడీ టీచర్ ఈ నెల 19వ తేదీన మంచిర్యాల జిల్లా కాశీపేటలో కరోనా వ్యాక్సిన్ తీసుకొంది. వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత ఆమె అనారోగ్యానికి గురైందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత తీవ్రంగా జ్వరంతో ఆమె బాధపడింది. దీంతో ఆమెను చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించినట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు. పది రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ ఆదివారం నాడు మరణించింది. ఆమె మృతికి కొవిడ్‌ టీకా కారణం కాదని వైద్యశాఖ పేర్కొంది. గుండె, శ్వాస సమస్యతో ఆమె చనిపోయారని వెల్లడించింది.