
- మోదీ మళ్లీ ప్రధాని అవుతారు
- కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలి
- అవినీతి సొమ్మును ప్రజలకు పంచాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఇండియా కూటమి నేతలు ఓర్వలేకపోతున్నారని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ అన్నారు. కూటమికి ఎజెండానే లేదని విమర్శించారు. మళ్లీ మోదీయే ప్రధాని అవుతారనే అక్కసుతో కూటమి లీడర్లు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి నుంచి ఒక్కో పార్టీ బయటికి వచ్చేస్తున్నదని అన్నారు. అది కూటమి కాదని.. ఘమండియా ఘట్ బంధన్ అని విమర్శించారు. దేశంలో కుటుంబ పార్టీలకు కాలం చెల్లిందన్నారు.
ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో పార్టీ అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాశ్, రాణిరుద్రమ, రచనా రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇండియా కూటమికి దేశ ప్రజల పట్ల పట్టింపు లేదు. అందుకే ఆ కూటమి చెల్లా చెదురు అవుతున్నది. కాంగ్రెస్ తమకు సంబంధం లేదని వెస్ట్ బెంగాల్లో మమతా, ఢిల్లీ, పంజాబ్లో ఆప్ తేల్చి చెప్పాయి. యూపీలో అఖిలేశ్ కూడా ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. కూటమి నుంచి నితీశ్ బయటికొచ్చేశారు’’అని లక్ష్మణ్ అన్నారు. అణగారిన వర్గాల తరఫున న్యాయం కోసం పోరాడిన కర్పూరి ఠాకూర్ను భారతరత్నకు ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకను కాంగ్రెస్ రాజకీయం చేసిందని మండిపడ్డారు.
గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టిన్రు
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అవినీతి సొమ్ము కక్కించి ప్రజలకు పంచుతామన్న కాంగ్రెస్ హామీ ఏమైందన్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. రైతులకు రైతుబంధు, నిరుద్యోగులకు జాబ్లు ఇవ్వడం లేదని విమర్శించారు. హామీల విషయంలో మోసం చేయాలనుకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. 10 సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి తెలంగాణ ప్రజలంతా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.