మోదీ ప్రధాని అయ్యాక పథకాల్లో లీకేజీ అన్నదే లేదు

మోదీ ప్రధాని అయ్యాక పథకాల్లో లీకేజీ అన్నదే లేదు

దేశం కన్నా ప్రధాని మోడీకి ఏదీ ఎక్కువ కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని సేవతో జరుపుకుంటున్నామన్నారు. అందులో భాగంగా ప్రతీ బీజేపీ కార్యకర్త రక్తదానం చేయడమో, టీబీ రోగిని దత్తత తీసుకోవడమో చేస్తున్నామని తెలిపారు. మోడీ దేశంలోని ప్రతి ఒక్కరి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతి పేదవాడిని జన్ ధన్ ఖాతాలతో బ్యాంకుల దగ్గరకు తీసుకొచ్చారన్న నిర్మల సీతారామన్... ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అందేలా డీబీటీ అమలు చేస్తున్నారన్నారు. గతంలో కేంద్రం రూ. 100 ఇస్తే రూ.15 మాత్రమే లబ్దిదారుడికి చేరేదని, కానీ ఇప్పుడు కేంద్రం ఎంత ఇస్తే అంత మొత్తం నేరుగా పేదవాడి ఖాతాకు చేరుతోందని చెప్పుకొచ్చారు. మోదీ ప్రధాని అయ్యాక పథకాల్లో లీకేజీ అన్నదే లేకుండా అమలవుతున్నాయన్నారు. 

ముద్ర స్కీం ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండా చిరువ్యాపారులకు రుణాలు అందుతున్నాయని  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. తాను పెరిగిన నర్సాపురంలో తన చిన్నతనంలో కూరగాయల వ్యాపారులు ఎన్ని కష్టాలు పడేవారో చూశానన్న నిర్మల... డైలీ ఫైనాన్స్ వ్యవస్థ నుంచి రూ.100 రుణంగా తీసుకుంటే రూ.90 మాత్రమే ఇచ్చేవారని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. సాయంత్రం వ్యాపారం ముగించుకుని తిరిగి చెల్లించేటప్పుడు రూ.100 చెల్లించాల్సి వచ్చేదని చెప్పారు. ఈ తరహాలో రోజువారీ దోపిడీకి చిరు వ్యాపారులు గురయ్యేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థ అందరికీ అందుబాటులోకి వచ్చిందన్న కేంద్ర మంత్రి.. ప్రతి కుటుంబానికి సొంతిల్లు అందించాలన్నది ప్రధాని తాపత్రయమని చెప్పారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేంద్రం ఇళ్లను మంజూరు చేసిందన్న నిర్మలా సీతారామన్... నేషన్ ఫస్ట్ (దేశమే అన్నింటికంటే ముందు) అన్న విధానంతో మోదీ పనిచేస్తారని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయనకు దేశం కంటే ఏదీ ఎక్కువ కాదని, అలాంటి వ్యక్తి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని నిర్మలా సీతారామన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.