తిన్న తర్వాత ఇవి చేయకూడదు

తిన్న తర్వాత ఇవి చేయకూడదు

ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంచుకోవడానికి తప్పక పాటించుకోవాల్సిన జాగ్రత్తల్లో కొన్నిటి గురించి తెలుసుకుందాం. మన రోజూవారీ కార్యకలాపాలు, తీసుకునే ఆరోగ్యమే మనకు ఏ ముప్పూ లేకుండా కాపాడుతాయి. ఆదరాబాదరాగా తినడం, తిన్న తర్వాత చేయకూడని పనులు చేస్తూ.. మన ఆరోగ్యానికి మనమే చేజేతులా పాడు చేసుకుంటున్నామని చెబుతున్నారు నిపుణులు. మనలో చాలా మందికి తిన్న తర్వాతే.. పడుకోవడం, ఈత కొట్టడం, వ్యాయామం చేయడం అలవాటు. కానీ ఇవే కొంప ముంచుతాయంటున్నారు వైద్య నిపుణులు. భోజనం చేసిన తర్వాత మనమేం చేయకూడదనేమీద పలువురు నిపుణులు ఇస్తున్న సూచనలు.

స్నానం చేయొద్దు :

ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయడం కూడా ప్రమాదమేనట. అది మన శరీర ఉష్ణోగ్రతను అమాంతం పెంచుతుందట. ఈ క్రమంలో మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో ఉండే జీర్ణక్రియకు ఆటంకం కలిగించినట్టేనట. దీంతో ఇది దాని పని సక్రమంగా చేయక లేనిపోని రోగాలు తలెత్తే అవకాశాలు ఎక్కువట. తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల నుంచి గంట దాకా స్నానం గురించి మరిచిపోతే మంచిదని నిపుణుల సూచన.

బెల్ట్ పెట్టుకోవద్దు :

చాలా మంది ఉద్యోగస్తులు ఆఫీసుల్లో లంచ్ చేసేటపుడు బెల్ట్ పెట్టుకునే భోజనం కానించేస్తారు. కానీ అలా చేయకూడదంట. తినేటపుడు కడుపును నిర్బందిస్తే.. జీర్ణక్రియ సమస్యలు వస్తాయట. తినే సమయంలో బెల్ట్ ను వదులు చేసుకోవడం, లేదా పూర్తిగా తీసేయడం ఇంకా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాయామం అస్సలే వద్దు :

భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయడం అంటే కొత్త రోగాలను కొని తెచ్చుకోవడమే అంటున్నారు న్యూట్రీషియన్లు. వ్యాయామం చేయక ముందు గానీ, చేసిన తర్వాత గానీ.. తినడానికి రెండు గంటల సమయం కేటాయించాలని చెబుతున్నారు. తిన్న వెంటనే వ్యాయామం చేస్తే.. అది కడుపు వికారం చెందడం, తిమ్మిర్లు రావడం ఖాయమని అంటున్నారు. అయితే సాధారణ నడకతో పెద్దగా నష్టాలేమీ ఉండవని సూచిస్తున్నారు.

నిద్ర పోవొద్దు :

చాలా మందికి తిన్న వెంటనే ఓ కునుకు తీయాలనిపిస్తుంది. పుష్టిగా భోజనం చేసిన తర్వాత నిద్ర ముంచుకొస్తుంటే ఎవరాపుతారు..? ఎంత పనున్నా సరే.. ఒక ఇరవై నిమిషాలైనా పడుకుంటాం అనుకుంటారు. ఇక రాత్రి పూటైతే వేరే చెప్పాలా..? కానీ ఇది అత్యంత ప్రయాదకరం. తిన్న తర్వాతే నిద్రపోతే అది ఊబకాయానికి బాటలు వేసినట్టే. అంతేగాక గుండెల్లో మంట, ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయట. తిన్న తర్వాత కనీసం రెండు గంటలైనా వేచి ఉండాలని.. అప్పుడే నిద్ర పోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.

ఈత కొట్టొద్దు:

తిన్న వెంటనే ఈత కొట్టడం చాలా ప్రమాదకరం. దీని ద్వారా కడుపు తిమ్మిరికి వచ్చే ప్రమాదం ఎక్కువ. తిన్న తర్వాత ఈత కొడితే జీర్ణక్రియ భాగా పనిచేస్తుందని అంటుంటారు. అయితే ఈతకు జీర్ణక్రియకు సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇలా భోజనం చేసిన తరువాత చేయగూడని పనులను సూచిస్తున్నారు నిపుణులు. మనం కూడా ఇవి పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.