మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉండాలంటే..

మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉండాలంటే..

మధుమేహం వస్తే జీవితాంతం మందులు వాడాలి. అంతేకాకుండా ప్రతి రోజు శరీరంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. ఇలా ఉండాలంటే మందులు వేసుకోవడంతో పాటు కొన్ని థెరపీలు పాటించాలని డాక్టర్లు చెబుతున్నారు.

న్యూట్రిషనల్‌ థెరపీ

పోషకాహార థెరపీ(న్యూట్రిషనల్‌ థెరపీ) వల్ల టైప్‌-2 మధుమేహం ఉన్న వాళ్ల శరీరంలోని చక్కెర స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచొచ్చని  కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో 800 క్యాలరీలు ఉంటే చక్కెర స్థాయిలు సాధారణంగా ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్న వాళ్లు పోషకాహారం తీసుకోవడం వల్ల వ్యాధి తీవ్రతలను తగ్గించుకోవచ్చు.

యోగా థెరపీ

రోజూ యోగాసనాలు వేయడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది. అయితే, యోగాసనాలను చిన్న చిన్న భంగిమలతో మొదలుపెట్టాలి. ప్రాణాయామం, శవాసనం.. లాంటివి మధుమేహ తీవ్రతను తగ్గిస్తాయి. ఈ ఆసనాలలో ధ్యానం, శ్వాస పద్ధతులు అనుసరించడం వల్ల  ప్లీహగ్రంధి, పియూష గ్రంధి(పిట్యూటరీ గ్లాండ్‌) చక్కెర స్థాయిలను సాధారణ స్థితిలోకి తీసుకొస్తాయి.

ఆక్యుప్రెజర్‌

ఆక్యుప్రెజర్‌ వల్ల చాలామంది మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఇందులో వ్యాధిని ప్రోత్సహించే అంగంపై  ఆక్యుప్రెజర్‌ పెట్టడం ద్వారా వ్యాధి తీవ్రతలను తగ్గించవచ్చు. ఈ చికిత్స వివిధ స్థాయిలు, అంగాలపై ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు- చిన్నపేగుకు, పిత్తాశయానికి వేర్వేరుగా ఉంటాయి.

నేచురోపతి

నేచురోపతిక్‌ మెడిసిన్‌(ప్రకృతిసిద్ధ ఔషధం) చికిత్సలో సహజ ఔషధాలు ఉపయోగించి చికిత్స అందిస్తారు. ఇందులో హోమియో థెరపీ, హెర్బల్‌ ట్రీట్​మెంట్‌, ఆక్యుపంక్చర్‌, లైఫ్‌ స్టయిల్‌ కౌన్సెలింగ్‌.. లాంటి విభాగాలు కూడా ఉంటాయి. నేచురోపతి ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఆహార ప్రణాళికతో పాటు యోగా, స్టీమ్‌ బాత్‌ లాంటివి కూడా చేయిస్తారు.

హోమియోపతి

మధుమేహ వ్యాధిని, దాని లక్షణాలను తగ్గించే సంపూర్ణ పద్ధతిగా హోమియోపతిని పేర్కొంటారు డాక్టర్లు. చాలా సంవత్సరాలుగా ఈ పద్ధతి అందుబాటులో ఉండటం వల్ల హోమియోపతీ వైద్యాన్ని వాడేవాళ్ల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది.

హెర్బల్‌ రెమిడీ

హెర్బల్‌ మెడిసిన్‌ ద్వారా మధుమేహ తీవ్రతలను తగ్గించవచ్చు. ఉసిరి, కాకరకాయ, మెంతులు, కరివేపాకు, బ్లాక్‌బెర్రీస్‌ లాంటివి హెర్బల్​ మెడిసిన్​ కిందకు వస్తాయి. వీటితో పాటు టైప్‌-2 మధుమేహ వ్యాధిలో రిఫ్లెక్సాలజీ(ప్రతిచర్య) చికిత్స ద్వారా రక్త ప్రవాహంలో మార్పులు కలిగాయని పరిశోధకులు చెబుతున్నారు.