- ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన నాగోల్ పోలీసులు
ఎల్బీనగర్, వెలుగు: ఒంటరిగా వస్తున్న కార్లు, బైక్లను లిప్టు అడిగి వారి వద్ద బంగారం దోచేస్తున్న ఇద్దరు మహిళా సభ్యుల ముఠాను నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. నాగోల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ రాఘవేంద్ర కాలనీకి చెందిన పసుపులేటి శిరీష, ఎల్బీనగర్ కు చెందిన ఖాదర్ ఉన్నిసా బేగం అలియాస్ సమీరా ఇద్దరు బ్యూటీషియన్ గా పని చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఈజీగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసుకున్నారు. నాగోలు పరిసర ప్రాంతాల్లో రోడ్డు మీద నిలబడి బైక్లు, కార్లలో ఒంటరిగా వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని లిప్ట్ అడిగేవారు.
అనంతరం ఇద్దరు కలిసి మాటల్లో పెట్టి దృష్టి మళ్లించి లిప్టు ఇచ్చిన వారి వద్ద బంగారం ఆభరణాలు చోరీ చేసేవారు. ఈ క్రమంలో నాగోలు బండ్లగూడ కు చెందిన శామ్యూల్ అనే ఓ వ్యక్తిని దృష్టి మళ్లించి రెండున్నర తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నాగోలు పోలీసులు ఆదివారం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఇద్దరు గతంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు చోరీలు చేసినట్లు పోలీసులు తెలిపారు.