- లోక్ సభ లాబీలోనే మహిళా ఎంపీకి బెదిరింపులు
- జైల్లో పెడతామంటూ శివసేన ఎంపీ బెదిరించిండు
- యాసిడ్ పోస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని స్పీకర్కు కంప్లైంట్ చేసిన ఎంపీ నవనీత్ కౌర్
మహారాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతామని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ బెదిరించారని లోక్సభ స్పీకర్కు నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఫిర్యాదు చేశారు. తనపై యాసిడ్ పోస్తామంటూ ఆ పార్టీ నుంచి లెటర్స్, కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: లోక్సభ లాబీలో శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరించాడని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానా ఆరోపించారు. మహారాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడాననే తనపై బెదిరింపులకు దిగాడని చెప్పారు. రాష్ట్రంలో అడుగుపెడితే అరెస్టు చేయించి, జైలులో పెట్టిస్తానని వార్నింగ్ ఇచ్చాడని వివరించారు. లోక్సభ లాబీలో ఈ సంఘటన చోటుచేసుకున్న టైమ్లో రాజమండ్రి ఎంపీ భరత్ మార్గానీ కూడా అక్కడే ఉన్నారని, అరవింద్ మాటలను విన్నారని అన్నారు. అరవింద్ బెదిరింపుల విషయాన్ని స్పీకర్ ఓంబిర్లా దృష్టికి తీసుకెళ్లానని కౌర్ వివరించారు. ఎంపీ అరవింద్ సావంత్ను కఠినంగా శిక్షించాలని కోరానన్నారు.
సర్కారుపై ఆరోపణలు..
నెలనెలా వంద కోట్లు వసూలుచేసి ఇవ్వాలని మహారాష్ట్ర హోంమంత్రి పోలీసులకు టార్గెట్ పెట్టారని ముంబై మాజీ సీపీ పరంబీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే! ఈ అంశాన్ని సభలో ప్రస్తావిస్తూ.. మాజీ సీపీ ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయాలని డిమాండ్ చేశానని రానా తెలిపారు. ఆ తర్వాత నుంచే తనకు శివసేన లెటర్హెడ్తో తనకు బెదిరింపు లెటర్లు వస్తున్నాయని, యాసిడ్ దాడి చేస్తామని ఫోన్లలో బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే స్పీకర్కు కంప్లైంట్ చేశామన్నారు. అయితే, ఎంపీ నవనీత్ కౌర్ ఆరోపణలను శివసేన ఎంపీ అరవింద్ ఖండించారు.