ఓఎంసీ కేసు విచారణ నుంచి తప్పుకున్న ముగ్గురు జడ్జిలు

ఓఎంసీ కేసు విచారణ నుంచి  తప్పుకున్న ముగ్గురు జడ్జిలు

హైదరాబాద్, వెలుగు: ఓబుళాపురం మైనింగ్‌‌‌‌ కేసులో దోషులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ నుంచి బుధవారం ముగ్గురు జడ్జిలు తప్పుకున్నారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌‌‌‌ కేసులో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్‌‌‌‌ చేయాలంటూ దోషులు బి.వి. శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, ఓఎంసీ కంపెనీ, మెఫజ్‌‌‌‌ అలీఖాన్, వి.డి.రాజగోపాల్‌‌‌‌లు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. దోషులందరు శిక్షను సస్పెండ్‌‌‌‌ చేసి బెయిలు మంజూరు చేయాలని కోరగా, గాలి జనార్దన్ రెడ్డి శిక్షను రద్దు చేయాలంటూ అప్పీలు దాఖలు చేశారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌‌‌‌ కేసులో ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు మే 6న వెలువరించిన తీర్పుపై గత వారం దోషులు అప్పీలు దాఖలు చేశారు. 

ఈ నెల 21న అప్పీళ్లపై జస్టిస్‌‌‌‌ నందికొండ నర్సింగ్‌‌‌‌రావు విచారణ చేపట్టి సీబీఐ వివరణ కోరుతూ విచారణను వాయిదా వేశారు. దీంతో బుధవారం జస్టిస్‌‌‌‌ కె.శరత్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ముందుకు విచారణకు వచ్చాయి. ఉదయం కోర్టు ప్రారంభ సమయంలోనే ఈ కేసులను మరో న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఇవి జస్టిస్‌‌‌‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ బెంచ్‌‌‌‌ ముందుకు విచారణకు రాగా ఆయన తప్పుకొన్నారు. దీంతో న్యాయవాదులు సీనియర్‌‌‌‌ న్యాయమూర్తి అయిన నగేశ్‌‌‌‌ భీమపాక ధర్మాసనం ముందు ప్రస్తావించగా ఆయన తప్పుకొంటున్నానని, వచ్చే వారం మరో న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.