జూపార్కులో మూడు కొత్త ఎన్‌‌క్లోజర్లు

జూపార్కులో మూడు కొత్త ఎన్‌‌క్లోజర్లు

హైదరాబాద్, వెలుగు: నెహ్రూ జూలాజికల్​పార్కులో మూడు కొత్త ఎన్​క్లోజర్లను అందుబాటులోకి తెచ్చారు. పార్కు ఏర్పాటై 59 ఏళ్లు పూర్తిచేసున్న సందర్భంగా గురువారం జూడే నిర్వహించారు. అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న 68వ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య ​అతిథిగా అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఆర్‌‌‌‌ఎం డోబ్రియాల్ పాల్గొని కొత్త ఎన్‌‌క్లోజర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది జూపార్క్ డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. జూ సిబ్బంది అంకితభావం, సరైన నిర్వహణతో దేశంలోనే ప్రముఖ జూపార్క్‌‌గా ప్రశంసలు అందుకుంటోందని అన్నారు. సందర్శకులు జంతువుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. పిల్లలకు అడవులు, జంతువుల పట్ల ప్రేమ పెరిగేలా తల్లిదండ్రులు చూడాలన్నారు. దక్షిణాఫ్రికాలో కనిపించే ముంగిస జాతికి చెందిన మీర్ క్యాట్, దక్షిణ అమెరికా అడవుల్లో కనిపించే చిన్న కోతి జాతికి చెందిన మార్మో సెట్ ఎంక్లోజర్లను ఈ సందర్భంగా ప్రారంభించారు.

వివిధ రకాల చేపలతో ఉన్న ఓపెన్ ఫిష్ పాండ్ ను ఏర్పాటు చేశారు. కొన్నాళ్ల క్రితం జన్మించిన  ఆసియాటిక్ సింహానికి అదితి అని పేరు పెట్టారు. జూ పార్క్ డైరెక్టర్, అదనపు పీసీసీఎఫ్ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. జూలో సందర్శకుల సంఖ్య పెరుగుతోందన్నారు. అనంతరం నిబద్ధతతో పనిచేస్తున్న సిబ్బందికి కేవీఎస్ బాబు మెమోరియల్ అవార్డులు అందించారు. జూలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జంతువులను దత్తత తీసుకున్న, జూ పార్కు నిర్వహణకు విరాళాలు ఇచ్చిన కొందరిని యాజమాన్యం సత్కరించింది. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ఓఎస్డీ శంకరన్, రిటైర్డ్ అటవీ అధికారులు బుచ్చి రామ్ రెడ్డి, నాగభూషణం, డిప్యూటీ క్యూరేటర్ నాగమణి, ఇతర జూ అధికారులు పాల్గొన్నారు.