తిరుమల మరో అద్భుత ఆధ్యాత్మిక వేడుకకు సిద్ధమవుతోంది. శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల నిర్వహణకు TTD ఏర్పాట్లు చేసింది. స్వామి పుష్కరిణిలో ఐదు రోజు పాటు స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తిరుమలలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 2వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల నేపథ్యంలో సోమవారం ( ఫిబ్రవరి 23) స్వామి పుష్కరిణిలో తెప్పలపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో ట్రయల్రన్ నిర్వహించి.. ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ తెప్పోత్సవాలకు తెప్పలను పూర్తిగా సిద్ధం చేసినట్టు తెలిపారు. ఇంజినీరింగ్, విద్యుత్, ఆలయ అధికారులతో కలిసి తెప్ప సామర్థ్యాన్ని పరిశీలించామన్నారు.
తొలిరోజు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై విహరిస్తారని తెప్సోత్సవ కార్యక్రమాలను వివరించారు.
చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. మొదటి మూడు రోజులు మూడుసార్లు, 4వ రోజు ఐదుసార్లు, చివరిరోజు ఏడుసార్లు తెప్పలపై ఉత్సవ మూర్తులు విహరించి భక్తులను అనుగ్రహిస్తారని చెప్పారు.
తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 28న, మార్చి 01, 02వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఈ తెప్పోత్సవాల ట్రయల్ రన్లో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఈఈలు శ్రీనివాసరావు, సుధాకర్, డిఈ చంద్ర శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
