నేను దేవుడి బిడ్డను, పేరు మార్చుకోను: టీఎంసీ ఎంపీ

నేను దేవుడి బిడ్డను, పేరు మార్చుకోను: టీఎంసీ ఎంపీ

పశ్చిమ బెంగాల్: తాను భగవంతుడి ప్రత్యేక బిడ్డనని అన్నారు తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపీ నుస్రత్ జహాన్. దసరా వేడుకల సందర్భంగా శుక్రవారం కలకత్తా ఛల్తాభగాన్ లోని ఓ దుర్గా పూజా మండపంలో సింధూర్ ఖేలా వేడుకలో ఆమె పాల్గొన్నారు. దేవీ నవరాత్రులు జరిపిన తర్వాత అక్కడి హిందూ మహిళలు తమ సంప్రదాయంలో భాగంగా నొసట కుంకుమ ధరించి సింధూర్ ఖేలా ను నిర్వహించడం ఆనవాయితీ. దుర్గా దేవి కాలికి ఉన్న కుంకుమను నుదట ధరించి, ఆమ్మవారికి మిఠాయిలను నైవేద్యంగా పెడతారు. తమ కుటుంబాలు సంతోషంగా ఉండాలని మహిళలు ఒకరికొకరు కుంకుమను ధరిస్తారు.

ఈ వేడుకలో భర్త నిఖిల్ జైన్ తో సహ పాల్గొన్న ఎంపీ నుస్రత్..  మానవత్వం , ప్రేమ కంటే మరేమీ ముఖ్యమైనది కాదనే విషయాన్ని ఇప్పటికే ప్రజలకు తెలిపానని, తాను అన్ని మతాల ప్రజలను, వారి సంప్రదాయాన్ని గౌరవిస్తానని అన్నారు. ముస్లిం మహిళనైన తనను, హిందూ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తనను చాలామంది పేరు మార్చుకోవాల్సిందిగా సూచించారని అన్నారు. తాను ఆ దేవుని ప్రత్యేక బిడ్డనని, అన్ని మతాలను గౌరవిస్తానని, ప్రత్యేకంగా పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని నుస్రత్ ఈ సందర్భంగా అన్నారు.