టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. లైగర్ మూవీ ఆర్థిక వ్యవహారాలపై అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. లైగర్ సినిమాకు కొందరు రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ తమ ఎదుట హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మిని విచారించారు.
ప్రధానంగా లైగర్ సినిమా షూటింగ్ కోసం ఇద్దరి అకౌంట్స్లో డిపాజిట్ అయిన డబ్బుకు సంబంధించిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు తెలిసింది. సినిమా షూటింగ్ కోసం ఫారిన్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..? పెట్టుబడులు ఎవరు పెట్టారు..? అనే వివరాలను సేకరించింది. విదేశాల్లో జరిగిన షూటింగ్ సెట్టింగ్స్, అక్కడి నటులకు చెల్లించిన రెమ్యునరేషన్కు సంబంధించిన డాక్యుమెంట్స్ను పరిశీలించినట్లు తెలుస్తోంది. మూవీ కోసం తీసుకున్న బ్యాంక్ లోన్స్, ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకున్న రుణాలు, విదేశాలకు డబ్బును ఏ రూపంలో తరలించారనే కోణంలో ప్రశ్నించినట్లు తెలిసింది.