- ట్రాఫిక్ చలాన్లతో నాలుగేండ్లలో రూ.2,220 కోట్లు
- జరిమానాలతో సర్కారుకు భారీగా ఆమ్దానీ
- ‘హెల్మెట్ లేని’ కేసులే ఎక్కువ..
- టార్గెట్స్తో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులు
- నాలుగేండ్లలో 6.18 కోట్ల కేసులు
- గతేడాది 2.22 కోట్ల కేసులు.. రూ.877 కోట్ల ఫైన్లు
హైదరాబాద్, వెలుగు: ట్రాఫిక్ చలానాలు ప్రభుత్వ ఖజానాకు కాసుల పంట పండిస్తున్నాయి. టార్గెట్స్తో డ్యూటీ చేస్తున్న పోలీసులు సర్కార్ గల్లా పెట్టెలో రూ.వందల కోట్లు నింపుతున్నారు. నాలుగేండ్లలో వాహనదారులకు ఏకంగా రూ.2,220 కోట్ల ఫైన్లు వేశారు. 6.18 కోట్ల కేసులు నమోదు చేశారు. గతేడాది 2,22,55,363 కేసులు రిజిస్టర్ చేసి, రూ.877 కోట్ల జరిమానాలు వేశారు. హెల్మెట్ రూల్ దగ్గర్నుంచి డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ సహా మొత్తం18 రకాల సెక్షన్స్తో కేసులు నమోదు చేస్తున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
ఫస్ట్ ప్లేస్లో హెల్మెట్ ఫైన్స్
హెల్మెట్ లేనోళ్లు, సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ క్రాస్, సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, సీట్ బెల్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తిరిగే వారిపై పోలీసులు కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. ఇందులో ప్రతి ఏటా ఫస్ట్ ప్లేస్లో హెల్మెట్ ఉల్లంఘనలు ఉంటున్నాయి. సెకండ్ ప్లేస్లో ఓవర్ స్పీడింగ్, థర్డ్ ప్లేస్లో ట్రిపుల్ రైడింగ్ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి చలానాల డేటాను టీఎస్ పోలీస్ వెబ్సైట్స్, టీఎస్ కాప్ ట్యాబ్స్ లో ఫీడ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ (వెహికిల్ చెకింగ్) టైమ్లో చలాన్స్ పెండింగ్ ఉన్న వెహికల్స్ను సీజ్ చేస్తున్నారు. కనీసం సగం చలానాల అమౌంట్ చెల్లించేంత వరకు వెహికల్స్ను రిలీజ్ చేయడం లేదు.
తాగి నడిపితే చార్జ్షీట్
డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. గతంలో రాత్రి 10 గంటల తర్వాత స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించే వాళ్లు. కానీ ఇప్పుడు 8 గంటలకే స్టార్ట్ చేస్తున్నారు. బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్(బీఏసీ) లెవల్స్ 30 ఎమ్జీ కంటే ఎక్కువ వచ్చిన వారిపై చార్జ్షీట్ ఫైల్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ నిర్వహించి, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో పట్టుబడే వారికి కోర్టులు రూ.10 వేల దాకా జరిమానా విధిస్తున్నాయి. దీంతో పాటు జైలు శిక్షలు, డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్టరైన కేసుల్లో గ్రేటర్లోని మూడు కమిషనరేట్లలో విధించే ఫైన్స్ రూ.వందల కోట్లలో ఉంటున్నాయి.
కెమెరాలతో పోలీసులు రెడీ..
వెహికల్ రోడ్డెక్కిన దగ్గర్నుంచి తిరిగి ఇంటికెళ్లేంత వరకు సీసీటీవీ కెమెరాలు, ట్రాఫిక్ పోలీసుల చేతుల్లోని డిజిటల్ కెమెరాలు నీడలా వెంటాడుతున్నాయి. ఉన్నతాధికారులు విధించిన టార్గెట్స్లో ట్రాఫిక్ పోలీసులు గ్రౌండ్ డ్యూటీ చేస్తున్నారు. పాయింట్ డ్యూటీస్లో ఉండే ప్రతి కానిస్టేబుల్ ఒక్కొక్కరు కనీసం 300 వరకు వయోలేషన్ వెహికల్స్ను ఫొటోస్ తీయాలి. దీనికి తోడు సీసీటీవీ కెమెరాలు, స్పీడ్ లేజర్ గన్స్ వాహనదారులను క్యాప్చర్ చేస్తున్నాయి. ఇలా కాంటాక్ట్, నాన్ కాంటాక్ట్ కింద పోలీసులు కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. కాంటాక్ట్ కేసుల్లో సర్వీస్ చార్జీలు లేకుండా యాక్ట్ ప్రకారం మాత్రమే ఫైన్స్ విధిస్తారు. కానీ సీసీటీవీ కెమెరాలు, డిజిటల్ కెమెరాలతో ఈ చలాన్స్ జనరేట్ చేసే నాన్ కాంటాక్ట్ కేసుల్లో మాత్రం ప్రతి చలాన్పై రూ.35 అదనంగా విధిస్తుంటారు. ఇలా ఏటా సర్వీస్ చార్జీలే రూ.కోట్లలో వసూలు చేస్తున్నారు.