అది ప్రభుత్వ ఈవెంట్ కాదు: బెంగుళూర్ తొక్కిసలాటపై CM సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు

అది ప్రభుత్వ ఈవెంట్ కాదు: బెంగుళూర్ తొక్కిసలాటపై CM సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు

బెంగుళూర్: కర్నాటక రాజధాని బెంగుళూర్‎లో ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం (జూన్ 8) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంగా బెంగుళూర్‎లో విక్టరీ పరేడ్ నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం కాదని తెలిపారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆ విజయోత్సోవ ర్యాలీ నిర్వహించిందని ఆయన క్లారిటీ ఇచ్చారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, కోశాధికారి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారని తెలిపారు. గవర్నర్ కూడా వస్తున్నారని చెప్పడంతోనే తాను కూడా విధాన సౌధకు వెళ్లాలని చెప్పారు. కేఎస్‎సీఏ ప్రతినిధులు తనను స్టేడియానికి ఆహ్వానించలేదని వెల్లడించారు సిద్ధరామయ్య. 

కాగా, 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఎట్టకేలకు ఐపీఎల్ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. 2025, జూన్ 3న జరిగిన ఫైనల్ మ్యాచులో పంజాబ్‎ను చిత్తు చేసి.. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్నా ఐపీఎల్ టైటిల్‎ను ఆర్సీబీ దక్కించుకుంది. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో జట్టు ఆటగాళ్లను సత్కరించేందుకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ) బుధవారం (జూన్ 4) చినస్వామి స్టేడియంలో ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. 

ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ స్టేడియం వద్ద తండోపతండాలు ఎగబడ్డారు. స్టేడియం కెపాసిటీ 30 వేలు ఉంటే.. దాదాపు 3 లక్షల మంది వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి.. 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న కర్నాటక హైకోర్టు.. కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. అందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు తొక్కిసలాట ఘటనకు సంబంధించి బెంగళూరు పోలీసులు ఆర్‌సీబి బృందం, కెఎస్‌సీఎ, డీఎన్‌ఎ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతరులపై కేసు నమోదు చేశారు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను, విజయోత్సవ ర్యాలీ నిర్వాహకులు DNA ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ముగ్గురు సిబ్బందిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య రిటైర్ట్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించారు. కమిటీ నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.