ఓల్డ్సిటీ, వెలుగు: కార్వాన్లో వినాయక మండపం తొలగింపు విషయంలో నిర్వాహకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో కాలనీకి చెందిన నలుగురు గాయపడ్డారు. ఆదివారం ఉదయం వినాయక మండపం స్థల యజమాని సంతోష్ షెడ్డును తొలగించేందుకు వెల్డర్ మహమ్మద్ అబ్దుల్లాను తీసుకెళ్లాడు. ఈ సమయంలో స్థానిక యువకులు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు వారితో వాగ్వాదానికి దిగారు.
అనంతరం కర్రలు, రాళ్లతో దాడి చేయగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. తొమ్మిది నెలలుగా ఈ స్థలంపై వివాదం కొనసాగుతోందని సమాచారం. హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేయగా, తొలగించాలని జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ కమిషనర్ ఆదేశించారని సంతోష్ తెలిపాడు.
సిబ్బంది కొరత కారణంగా తననే తొలగించుకోవాలని సూచించారని చెప్పాడు. మరోవైపు ఖాళీ ప్రదేశంలో వినాయక మండపం షెడ్ను శాశ్వతంగా ఉంచాలని మండప నిర్వాహకులు కార్తీక్, ధనరాజ్, వెంకటేష్, వినయ్ కోరుతున్నారు. ఈ ఘటనపై ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కుల్సుంపురా ఇన్స్పెక్టర్ పి.రాములు తెలిపారు.
