పద్మారావునగర్, వెలుగు: ప్రధాని మోదీ ఆలోచనలకు, దేశ ప్రజలకు మధ్య ‘మన్ కీ బాత్’ ఒక అద్భుతమైన వారధిలా నిలిచిందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి కొనియాడారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్లోని వైభవ్ ఫంక్షన్ హాల్లో బీజేపీ శ్రేణులతో కలిసి ఆదివారం మోదీ 135వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ఆయన వీక్షించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నెలా చివరి ఆదివారం నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సాహసోపేతమైన నిర్ణయమన్నారు.
దేశంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరిణామాలపై ప్రజలను చైతన్యపరిచే వేదికగా ‘మన్ కీ బాత్’ మారిందని ప్రశంసించారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు బంగారం కొనుగోళ్లు తగ్గించాలన్న మోదీ పిలుపునకు దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన లభించిందని చెప్పారు.
