ఎవరెన్ని అపనిందలు వేసినా, పేదవాడి గుమ్మానికి సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం విజయవంతంగా చేరవేస్తోందని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..హనుమకొండ జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన ఘనంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పేదలకు మంచి చేస్తే ఎలాంటి కమీషన్లు రావనే ఉద్దేశంతోనే గత కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. కేవలం లక్ష కోట్ల కమీషన్ల కోసమే ప్రాజెక్టులపై అప్పట్లో మోజు చూపారే తప్ప, పేదవాడికి రేషన్ కార్డు, కరెంట్, సన్నబియ్యం ఇవ్వాలనే సోయి పదేళ్లలో వారికి రాలేదని మండిపడ్డారు.
గత ప్రభుత్వం పేదలకు ఆత్మగౌరవ ఇళ్లు ఇచ్చే ఆలోచనే చేయలేదని, కానీ ప్రజా ప్రభుత్వం మాత్రం విడతలవారీగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లను అందించి తీరుతుందని భరోసా ఇచ్చారు.పేద మహిళలు దొడ్డుబియ్యం తినలేక ఇబ్బంది పడుతున్నా గత పాలకులకు కళ్లు కనబడలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ సన్నబియ్యం ఇవ్వట్లేదని గుర్తుచేశారు.
గత ప్రభుత్వం నెత్తిన పెట్టిన రూ. 8లక్షల21 వేల కోట్ల భారీ అప్పునకు అసలు, వడ్డీలు కడుతూనే, పేదలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.కేంద్రాన్ని మెడలు వంచి, ఒప్పించి, మెప్పించి వరంగల్కు ఎయిర్పోర్ట్ను సాధించుకువచ్చామని వెల్లడించారు.
తాము హైదరాబాద్, ఢిల్లీలో కూర్చొని కట్టుకథలు చెప్పే ప్రభుత్వం కాదని, చేతల్లో చూపించే ప్రభుత్వమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా కేవలం మీ ప్రాంతంలోనే కాకుండా పరిసర ప్రాంతాలలో కూడా రేషన్ తీసుకునే సౌకర్యం ఉంటుందని తెలిపారు.
