కృష్ణాలో ఉన్న నీళ్లన్నీ మావే.. ఏపీకి చుక్క కూడా లేవ్: కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

కృష్ణాలో ఉన్న నీళ్లన్నీ మావే.. ఏపీకి చుక్క కూడా లేవ్: కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ
  • ప్రస్తుతం సాగర్​, శ్రీశైలంలో కలిపి 
  • 146.54 టీఎంసీలున్నయ్​
  • బేసిన్​ లెక్కల పరంగా 71% వాటా 
  • తమదేనని తేల్చి చెప్పిన తెలంగాణ
  • ఉన్న నీళ్లలో 115.75 టీఎంసీలు 
  • తమవన్న ఏపీ.. తెలంగాణకు 
  • 30 టీఎంసీలేనంటూ వాదన
  • బోర్డు మీటింగ్​ పెట్టకుండా 
  • త్రీమెన్​ కమిటీ మీటింగ్​ 
  • పెట్టడంపై అనుమానాలు

హైదరాబాద్, వెలుగు: కృష్ణాలో ప్రస్తుతం డెడ్​స్టోరేజీకి ఎగువన ఉన్న నీళ్లన్నీ తెలంగాణవేనని, ఏపీకి చుక్క కూడా లేవని తెలంగాణ తేల్చి చెప్పింది. ప్రస్తుతం సాగర్‎లో డెడ్ ​స్టోరేజ్​కి ఎగువన వాడుకునేందుకు 17.79 టీఎంసీలు, శ్రీశైలంలో 128.75 టీఎంసీలు కలిపి మొత్తంగా 146.54 టీఎంసీల నీళ్లున్నాయని పేర్కొంది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్​సీ జనరల్ ఓవీ రమేశ్​ బాబు లేఖ రాశారు.

నీళ్లలో తెలంగాణ వాటా 71 శాతమని, ఏపీది కేవలం 29 శాతమేనని తేల్చి చెప్పారు. కృష్ణా ఇన్​బేసిన్​ జనాభా, సాగు, కరువు ప్రాంతాల ఆధారంగా 71 శాతం నీళ్లు తెలంగాణకే చెందుతాయన్నారు. ఆ లెక్క ప్రకారం తెలంగాణకు 173.77 టీఎంసీలు వస్తాయని,  ఇప్పుడు అందుబాటులో ఉన్న 146.54 టీఎంసీలు మొత్తం తమవేనని చెప్పారు. ఏపీకి చుక్క కూడా నీళ్లు లేవని లేఖలో ఈఎన్​సీ స్పష్టం చేశారు. ఇప్పటివరకు శ్రీశైలంలో కల్వకుర్తి ద్వారా 3.59 టీఎంసీలు, సాగర్​లో 6.89 టీఎంసీలు వినియోగించుకున్నామని లేఖలో తెలిపారు.

 2027 ఆగస్టు వరకు తెలంగాణ తాగునీటి అవసరాలు 50 టీఎంసీలని చెప్పారు. శ్రీశైలం నుంచి 10 టీఎంసీలు, సాగర్​ ఎడమ కాల్వ కింద 15 టీఎంసీలు, ఏఎమ్మార్పీ కింద 25 టీఎంసీల చొప్పున తాగునీటి అవసరాలున్నాయని పేర్కొన్నారు. ఎల్​నినో తీవ్రమయ్యే పరిస్థితులున్నాయని చెబుతున్నారని, దాని వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి కామన్​ రిజర్వాయర్లలోని జలాలను కేవలం తాగునీటికే ఇవ్వాలని, అవన్నీ తెలంగాణకే కేటాయించాలని స్పష్టం చేశారు. 

తెలంగాణకు 30 టీఎంసీలు చాలన్న ఏపీ

కామన్​ రిజర్వాయర్లలో ఉన్న నీళ్లలో తెలంగాణకు వచ్చేది 30 శాతమేనని, ఆ రాష్ట్రానికి 30 టీఎంసీలు చాలని పేర్కొంటూ ఏపీ కూడా కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. తమకు మాత్రం 115.70 టీఎంసీల నీళ్ల వాటా ఉన్నదని పేర్కొంది. ఇప్పటిదాకా వాడుకున్న నీటి వివరాలనూ వెల్లడించింది. ఏపీ శ్రీశైలంలో 6.45 టీఎంసీలు, సాగర్​లో 7.17 టీఎంసీలు వాడుకున్నట్టు తెలిపింది. అదే సమయంలో జూరాల నుంచి తెలంగాణ వాడుకున్న నీళ్లనూ లెక్కల్లో చూపించింది. అది కామన్​ రిజర్వాయర్​ కాకపోయినా 8.79 టీఎంసీలు వాడేసిందంటూ బుకాయించింది. మొత్తంగా తమకు అక్టోబర్​ వరకు తాగునీటి అవసరాల కోసం 47 టీఎంసీలను కేటాయించాలంటూ లేఖలో ఏపీ డిమాండ్​ చేసింది. 

బోర్డు మీటింగ్​ పెట్టకుండా త్రీమెన్​ కమిటీ మీటింగేంటి..?

ప్రతి వాటర్​ ఇయర్​ ప్రారంభానికి ముందు కృష్ణా బోర్డు మీటింగ్​ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బోర్డు మీటింగ్​లో చర్చకు వచ్చిన అంశాల ఆధారంగా త్రీమెన్​ కమిటీ మీటింగ్​ నిర్వహించాల్సి ఉంటుంది. బోర్డులో నిర్ణయించిన అంశాలను మాత్రమే త్రీమెన్​ కమిటీ అమలు చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు బోర్డు మీటింగ్​ లేకుండానే నేరుగా త్రీమెన్​ కమిటీ సమావేశం పెట్టడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా బోర్డు కుట్రపూరితంగానే త్రీమెన్​ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

బోర్డు సమావేశంలో అయితే.. కేఆర్‌‌ఎంబీ చైర్మన్‌‌, మెంబర్‌‌ సెక్రటరీ, టెక్నికల్‌‌ మెంబర్లు, రెండు రాష్ట్రాల సెక్రటరీలు, అధికారులు పాల్గొంటారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాడకం, వివాదాలపై బోర్డు మీటింగ్​లోనే చర్చించి వాటాలు ఖరారు చేస్తారు. ఏకాభిప్రాయం కుదరని అంశాలను కేంద్రానికి నివేదిస్తారు. కానీ, ఇక్కడ డైరెక్ట్​గా త్రీమెన్​ కమిటీ మీటింగ్​ను నిర్వహించాల్సిన అవసరమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బోర్డులో చర్చించిన అంశాలపై చర్చించి అమలు పరిచేలా త్రీమెన్​ కమిటీలో ఇండెంట్లు పెట్టి నీటి వాటాలు కోరుతారు. 

13న నిర్వహించాల్సిన త్రీమెన్​ కమిటీ మీటింగ్​ను 17కు వాయిదా వేసింది. నేరుగా రాలేమని, వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అటెండ్​ అవుతామని ఏపీ చెప్పడంతో తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మీటింగ్​ను 17కు వాయిదా వేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీసీలో అయితే చెప్పని విషయాలను చెప్పినట్టు.. చెప్పిన విషయాలను చెప్పనట్టుగా ఏపీ బుకాయించే ప్రమాదం ఉండడంతో వీసీ వద్దని మన అధికారులు తేల్చి చెప్పినట్టు సమాచారం.