ఫస్ట్ టైం.. ఆల్ ఉమెన్ పోలీస్ బ్యాండ్ .. స్వాతంత్య్ర వేడుకలకు పటిష్ట భద్రత

ఫస్ట్ టైం.. ఆల్ ఉమెన్ పోలీస్ బ్యాండ్  .. స్వాతంత్య్ర వేడుకలకు పటిష్ట భద్రత
  • మల్కాజ్​గిరిలో స్టార్ట్​ చేసిన సీపీ సుమతి

ఎల్బీనగర్, వెలుగు: మల్కాజ్​గిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన ఆల్ ఉమెన్ పోలీస్ బ్యాండ్ ను సీపీ బి.సుమతి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 11 మంది మహిళా పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం ఆకట్టుకునే ప్రదర్శన నిర్వహించింది. వీరికి 9 నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు సీపీ తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించగలరనడానికి ఈ బ్యాండ్ నిదర్శనమని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సివిల్, ట్రాఫిక్, షీ టీమ్, సైబర్ విభాగాలకు చెందిన మొత్తం 84 మంది పోలీస్ సిబ్బందిని సన్మానించి సేవా పతకాలు అందజేశారు. 

స్వాతంత్య్ర వేడుకలకు పటిష్ట భద్రత

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ వెల్లడించారు. సీఎం పరేడ్ గ్రౌండ్స్ రాక నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వీఐపీల రాకపోకలకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశామని చెప్పారు. 150 సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలకు సహకరించాలని కోరారు.