హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం పలు చెరువుల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే, ఇప్పటికే పలు చెరువుల దగ్గర జరుగుతున్న పనులను, రోడ్లపై వాటర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించారు. రామచంద్రాపురం మండలంలోని నల్లగండ్ల చెరువు పునరుద్ధరణ పనులను రైతులతో కలిసి ప్రారంభించారు. 90 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువులో 70 ఎకరాలు పట్టా భూములు.. ఇవన్నీ ఎఫ్టీఎల్ లో ఉండడంతో చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు వీలుగా రైతులు భూములను ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
అందరి సంతకాలతో గతంలోనే హైడ్రాకు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం ప్రారంభమైన చెరువు పునరుద్ధరణ పనుల్లోనూ రైతులు భాగస్వాములయ్యారు. టీడీఆర్ కింద తమకు నష్టపరిహారం అందేలా చూడాలని కమిషనర్ను కోరారు. చెరువు కట్టపై పురాతన అమ్మవారి ఆలయం ఉందని, అక్కడ పూజలు చేసుకునేందుకు వీలుగా కొంత ఎక్కువ స్థలాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, అడిషనల్ కమిషనర్ ఆనంద్కుమార్, ఏసీపీలు తిరుమల, శ్రీకాంత్ పాల్గొన్నారు.
