బయటనుంచి వచ్చినోళ్లే పెత్తనం చేస్తున్నరు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

బయటనుంచి వచ్చినోళ్లే పెత్తనం చేస్తున్నరు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  •     తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర పాలకులు, మీడియా చేతుల్లో ఉండొద్దు 

చౌటుప్పల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనమే కొనసాగుతోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌లోని సీతారామచంద్రస్వామి దేవాలయ పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేస్తానని స్పష్టం చేశారు. తాను ప్రభుత్వాన్ని కానీ, పార్టీని కానీ విమర్శించడం లేదన్నారు. 

అయితే, కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం పెరిగిపోతోందని.. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందనేది తన అభిప్రాయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందని.. తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన నాయకులకు తగిన గౌరవం దక్కాలని సూచించారు. తెలంగాణ ఏర్పడిందే ప్రజల ఆత్మగౌరవం కోసమని.. కానీ సీమాంధ్ర పాలకుల, మీడియా చెప్పుచేతల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నడవకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలని.. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల కోసం కాదన్నారు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని కోరారు.