దత్తాత్రేయను గౌరవించని నాయకులు.. తెలంగాణలో ఎవరూ లేరు: సీఎం రేవంత్ రెడ్డి

దత్తాత్రేయను గౌరవించని నాయకులు.. తెలంగాణలో ఎవరూ లేరు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వారు.. ప్రముఖ నాయకుడు బండారు దత్తాత్రేయ జీవనశైలిని చూసి ఎంతో నేర్చుకోవలసి ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్’ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ “ప్రజల కథే నా ఆత్మ కథ” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తనకు ఆయనతో 40 సంవత్సరాల అనుబంధం ఉందని, దత్తాత్రేయ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. దత్తాత్రేయను గౌరవించని నాయకులు తెలంగాణలో ఎవరూ లేరని, ఆయన స్ఫూర్తి తమ ప్రభుత్వ నిర్ణయాల్లో ఉంటుందని సీఎం చెప్పారు. హైదరాబాద్ గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్గా ఎదిగేంత వరకు.. సుదీర్ఘమైన ప్రయాణంలో దత్తాత్రేయ ఎన్నో ఒడిదుడుకులను అనుభవించారని,  ప్రజలతో సంబంధాలను ఏనాడూ కోల్పోలేదని సీఎం రేవంత్ తెలిపారు.

రాజకీయంగా వేరు వేరు పార్టీల్లో తాము ప్రయాణం చేస్తున్నప్పటికీ వ్యక్తిగత సంబంధాల విషయంలో దాచిపెట్టాలన్న ప్రయత్నం చేయడం లేదని, దత్తాత్రేయను చూసి ఎంతో నేర్చుకోవాలని సీఎం కొనియాడారు. ప్రజలతో సంబంధాలు కలిగి ఉండటంలో దత్తాత్రేయగారు అజాత శత్రువని, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి జాతీయ రాజకీయాల్లో పదవుల్లో ఉన్నా లేకున్నా వారి గౌరవం ఎప్పుడూ తగ్గలేదని.. అలాగే దత్తాత్రేయను కూడా రాజకీయాల్లో  అదే తీరుగా గౌరవిస్తారని సీఎం చెప్పారు. 

బీజేపీ నాయకుడిగా కన్నా దత్తాత్రేయను ఒక మర్యాద కలిగిన నాయకుడిగా అందరూ గౌరవిస్తారని సీఎం గుర్తుచేశారు. జంట నగరాల ప్రజలకు ఏ బాధ ఉన్నా వినడానికి సిద్ధంగా ఉండే వారిలో ఇద్దరు నాయకుల పేర్లు వినిపిస్తాయని, ఒకరు.. ఖైరతాబాద్ పి. జనార్ధన్ రెడ్డి అయితే, మరొకరు బండారు దత్తాత్రేయ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం.