
మహారాష్ట్రలో కుటుంబ రాజకీయాలు ఎంత బలంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా థాక్రే ఫ్యామిలీ, పవార్ ఫ్యామిలీ దశాబ్దాలు మహారాష్ట్రలో చక్రం తిప్పుతున్నాయి. అక్కడ వీళ్లను కాదని ఏ పార్టీ సొంతంగా అధికారం చేపట్టే పరిస్థితి లేదంటే ఈ కుటుంబాలు ఎంత ప్రభావితం చేస్తాయో ఊహించవచ్చు.
బాల్ థాక్రే రాజకీయ వారసులుగా అరంగేట్రం చేసిన రాజ్ థాక్రే, ఉద్ధవ్ థాక్రే కొన్నాళ్ల తర్వాత విడిపోయారు. కుటుంబ సభ్యులు రాజకీయ ప్రత్యర్థులు అయ్యారు. ఇలా వేర్వేరుగా ఉండటం వలన రాజకీయంగా నష్టపోవడమే తప్ప ఎవరికీ లాభం లేదని.. ఈ ఫ్యామిలీ మళ్లీ కలవాలనే లోచనలో ఉందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి వార్తలే మరో ఫ్యామిలీ గురించి వస్తున్నాయి.
మహారాష్ట్రలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన శరద్ పవార్ ఫ్యామిలీ ఈ మధ్య రెండు గ్రూపులుగా విడిపోయింది. అజిత్ పవార్ సొంత కుంపటి పెట్టుకుని ఎన్డీఏలో కలిసి అధికారం అనుభవిస్తున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 26 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఇరు పార్టీలు కలిసే అవకాశం ఉందని మహారాష్ట్రలో చర్చ నడుస్తోంది.
అజిత్ పవార్ (ఎన్సీపీ) వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్సీ, అమోల్ మిట్కారి ఈ చర్చకు మరింత ఆజ్యం పోశారు. ‘‘దేవుని దయ ఉంటే అజిత్ పవార్, సుప్రియా సూలే ఏకాదశి (జులై 6) లోపు కలిసిపోతారు’’ అని కామెంట్ చేశారు. అయితే ఈ ఊహాగానాలు ఇప్పుడే కొత్తేం కాదు. ఏకంగా పార్టీ చీఫ్ శరద్ పవార్ కూడా గతంలో ఈ అంశంపై మాట్లాడారు. ‘‘పార్టీలో రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి శరద్ పవార్ తో కలిసిపోవడం. రెండవది.. బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా కలవకపోవటం’’ అని అన్నారు. అయితే ఫైనల్ గా నిర్ణయం తీసుకునేది తన కూతురు సుప్రియా సూలే అని అనటంతో ఇరు వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి.
అయితే దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు . ఈ విషయంలో అఫీషియల్ ప్రపోజల్ వస్తే ఆలోచిస్తానని అన్నారు. ఒకవేళ ఈ రెండు వర్గాలు మళ్లీ కలిసిపోతే మహారాష్ట్ర రాజకీయ స్వరూపం మారిపోతుందని విశ్లేషకులు అంటున్నారు.
రెండు కుటుంబాలు.. రెండ్రెండు గ్రూపులు:
మహారాష్ట్ర రాజకీయాల్లో థాక్రే కుటుంబం, పవార్ కుటుంబం సుదీర్ఘ కాలంగా శాసిస్తూ వస్తున్నాయి. బాల్ థాక్రే వారసుల మధ్య వచ్చిన విభేదాలతో రాజ్ థాక్రే ‘మహారాష్ట్ర నవ నిర్మాణ సేన‘ (MNS) స్థాపించారు. అదే సమయంలో ఉద్ధవ్ థాక్రే తన తండ్రి బాల్ థాక్రే స్థాపించిన ‘శివసేన’కు సారథ్యం వహిస్తూ వస్తున్నారు. వీరు వేర్వేరు ప్రత్యర్థులుగా ఉండగా.. థాక్రే కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్న షిండే.. శివసేనను చీల్చి ఎన్డీఏ అలయన్స్ తో అధికారం అనుభవించారు. శివసేన పార్టీ ఎవరిదనే అంశంపై కూడా చాలా వివాదం జరిగింది. అసలైన వారసులం మేమేనని షిండే ప్రకటించే వరకు వెళ్లింది. దీంతో ఉద్ధవ్ థాక్రే శివసేన (UBT) అటు బీజేపీతో పాటు షిండేతో కూడా రాజకీయ యుద్ధం చేయాల్సి వస్తోంది.
థాక్రే వారసులు వేర్వేరుగా ఉండటం వలన.. బాల్ థాక్రే లెగసీని ఆ కుటుంబానికి సంబంధం లేని ఏక్ నాథ్ షిండే అనుభవిస్తున్నాడనే భావన థాక్రే వారసుల్లో ఉంది. శివసేనను చీల్చి ముఖ్యమంత్రి పదవి అనుభవించడం.. థాక్రే కుటుంబాన్ని టార్గెట్ చేయడంపై ఆ కుటుంబం సీరియస్ గా ఉంది. వేర్వేరుగా ఉండేకంటే కలిసిపోయి థాక్రే లెగసీని కొనసాగించాలని.. శివసేనను స్వాధీనం చేసుకోవచ్చుననే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాజ్ థాక్రే, ఉద్ధవ్ థాక్రే కలిసి పోతారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే శివసేనను చీల్చి అధికార పార్టీలో చేరిపోయిన ఏక్ నాథ్ షిండే కు పెద్ద ఛాలెంజింగ్ పరిణామమనే చెప్పుకోవచ్చు. అదే విధంగా వచ్చే ఎన్నికల్లో అధికార కూటమికి కూడా సవాలుగానే మారే అవకాశం ఉంది.
ఇదే సమయంలో పవార్ కుటుంబం కూడా ఒక్కటయ్యే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే థాక్రే ఫ్యామిలీ కలిసి పోవడంలో ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే ఎవరూ అధికారంలోగానీ, అధికార పార్టీలో గానీ లేరు. కానీ పవార్ కుటుంబం కలవడంలోనే కాస్త ఇబ్బంది కర పరిస్థితులు అయితే కినిపిస్తున్నాయి. ఎందుకంటే అజిత్ పవార్ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు. అందులోనూ ఉపముఖ్యమంత్రిగా కీలక పదవిలో ఉన్నారు. ఒకవేళ కలిస్తే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గానీ బీజేపీతో కలిసేది లేదని ఇప్పటికే శరద్ పవార్ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ పవార్ ఎన్డీఏను వీడి ప్రతిపక్షంలో ఉన్న శరద్ పవార్ తో చేరుతారా అనేదే అసలైన ప్రశ్న.
2023 లో ఎన్సీపీని చీల్చి మెజారిటీ ఎమ్మెల్యేలతో అధికారంలో ఉన్న బీజేపీ-శివసేన తో చేరిపోయారు అజిత్ పవార్. ఉపముఖ్య మంత్రి పదవిని పొందారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధ్యవర్యంలోని మహాయుతి అధికారాన్ని నిలబెట్టుకుంది. దేవేంద్ర ఫడ్నవీస్ కేబినెట్ లో కీలక మంత్రిగా, రెండవ ఉపముఖ్యమంత్రిగా పదవిని పొందిన విషయం తెలిసిందే.