
- సర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గ్రామాల ఎంపిక
- ప్రతి కమతాన్ని సర్వే చేసి ప్రత్యేక నంబర్ కేటాయిస్తున్న సిబ్బంది
- పహాణీలో ఉన్న భూమి, సర్వే వివరాలతో క్రాస్ చెక్
- మరో రెండు వారాల్లో పూర్తి కానున్న సర్వే
ఖమ్మం/ఎర్రుపాలెం, వెలుగు : రాష్ట్రంలో భూముల లెక్కలు తీయడంతో పాటు గెట్టు పంచాయితీలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన సర్వే పైలట్ గ్రామాల్లో స్పీడ్గా సాగుతోంది. భూభారతి అమలులో భాగంగా డ్రోన్స్తో పాటు డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) ద్వారా సర్వే చేసి ప్రతి ఇంచు భూమికి లెక్కతేల్చుతున్నారు. ఐదు రోజుల కింద ప్రారంభమైన ఈ సర్వే మరో రెండు వారాల్లో పూర్తి అవుతుందని రెవెన్యూ ఆఫీసర్లు చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గ్రామాల్లో..
రాష్ట్రంలో సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డ్రోన్, డీజీపీఎస్ సర్వే చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకోసం పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గ్రామాలను ఎంపిక చేసింది. ఇందులో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడు, జగిత్యాల జిల్లా కొమ్మనపల్లి (న్యూ), మహబూబ్నగర్ జిల్లాలోని సలార్నగర్, ములుగు జిల్లాలో నూగూరు, సంగారెడ్డి జిల్లాలో సాహెబ్నగర్ గ్రామాలు ఉన్నాయి.
ములుగుమాడులో ఈ నెల 3న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి అధికారికంగా సర్వేను ప్రారంభించారు. అదే రోజున జగిత్యాల జిల్లా కొమ్మనపల్లి (న్యూ), మహబూబ్నగర్ జిల్లాలోని సలార్నగర్, ములుగు జిల్లాలో నూగూరు, సంగారెడ్డి జిల్లాలో సాహెబ్నగర్ గ్రామాల్లో సైతం సర్వే ప్రారంభమైంది.
పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన ఖమ్మం జిల్లా ములుగుమాడులో వ్యవసాయ భూములకు సంబంధించి మొదటి నుంచి చిక్కులున్నాయి. నిజాం పాలన సమయంలో 1945లో ములుగుమాడు రెవెన్యూ ఆంధ్ర ప్రాంతంలో కలిసి ఉండేది. అప్పట్లో పరిటాల గ్రామం తెలంగాణలో ఉండేది. బదలాయింపుల్లో భాగంగా పరిటాల గ్రామాన్ని ఏపీకి మార్చి, ములుగుమాడును తెలంగాణకు మార్చారు. ఈ కారణంగా ఆ రెవెన్యూ పరిధిలోని భూములు ఎకరాలు, కుంటల్లో రికార్డు చేయకుండా సెంట్లలో చూపిస్తుండడంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ గ్రామంలో మొత్తం 103 సర్వే నంబర్లలో 450 మంది రైతులు ఉండగా వారికి సంబంధించి 845.32 ఎకరాల భూమి ఉంది. శనివారం వరకు 425 ఎకరాల భూమి సర్వేను పూర్తి చేశారు. ప్రతి రోజు సాయంత్రానికి సర్వే వివరాలను, సర్వే నంబర్ల వారీగా మ్యాప్లను డ్రాయింగ్ చేసి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. డీజీపీఎస్ సర్వే పూర్తయిన తర్వాత చివరి మూడు రోజులు డ్రోన్ ద్వారా సర్వే చేస్తామని సిబ్బంది చెబుతున్నారు.
సంగారెడ్డి జిల్లా సాహెద్నగర్ గ్రామానికి ముందుగా కొండారెడ్డిపల్లి శివారు, గట్టుపల్లి అనే పేర్లు ఉండేవి. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల ప్రకారం సాహెద్నగర్ (షాద్నగర్)గా ఉంది. ఈ గ్రామానికి 2014కు ముందు నక్ష ఉన్నప్పటికీ ధరణి వచ్చాక రికార్డులోకి రాలేదు. భూభారతి చట్టం వచ్చాక ఈ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి వారం రోజులుగా డీజీపీఎస్, డ్రోన్ల సాయంతో సర్వే చేస్తున్నారు. గ్రామంలో మొత్తం 574 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి.
గ్రామానికి సంబంధించి ఎక్కువగా హద్దుల సమస్య ఉంది. చాలా ఏండ్లుగా కబ్జాలో ఉన్నప్పటికీ హద్దులు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ భూములకు హద్దులు చూపించాలని 15 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా గ్రామ సరిహద్దుల వారీగా సర్వే చేసి మ్యాప్ తయారుచేశారు. భూముల ధరలకు రెక్కలు రావడంతో వందల ఏండ్ల క్రితం నాటి టేక్మాల్ దొరల వారసులు భూములన్నీ తమవేనని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి టైంలో భూభారతి చట్టం అమలులోకి రావడంతో తమ భూముల హద్దు సమస్యలు తొలగిపోనున్నాయని రైతులు అభిప్రాయపడుతున్నారు.
ములుగు జిల్లా నూగురు గ్రామంలో 540 ఎకరాల భూమి ఉండగా ఇప్పటికే డ్రోన్ సర్వే పూర్తయింది. ప్రస్తుతం డీజీపీఎస్ సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో పట్టా భూమి ప్రకారం మ్యాప్ తయారు చేస్తున్నారు. వ్యక్తిగతం, ప్రభుత్వ భూమి, చెరువు శిఖం భూమి, దేవాదాయ భూములను సైతం సర్వే చేస్తున్నారు. అన్నదమ్ముల గొడవలకు సంబంధించి నాలుగు అప్లికేషన్లను పరిష్కరించినట్లు రెవెన్యూ ఆఫీసర్లు తెలిపారు.
జగిత్యాల జిల్లాలో ఎస్సారెస్పీ ప్రాజెక్ట్లో ముంపునకు గురైన గ్రామాలకు రిహబిలిటేషన్ గ్రామమైన సారంగాపూర్ మండలంలోని కోమనపల్లి విలేజ్లో సర్వే కొనసాగుతోంది. కోమనపల్లి మొత్తం విస్తీర్ణం సుమారు 629 ఎకరాలు ఉండగా.. 220 ఎకరాలకు పైగా సర్వే పూర్తయింది. డ్రోన్ల ద్వారా ఫొటోలు తీస్తూ, డీజీపీఎస్ సాయంతో సర్వే పూర్తి చేస్తున్నారు.
ఇన్నేండ్లకు సమస్య పరిష్కారం అవుతోంది
ములుగుమాడులో సర్వే నెంబర్ 54, 55లో నాకు 10 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. ఇన్నేళ్ల నుంచి కుంటల్లో కాకుండా సెంట్లలో భూములు రికార్డుల్లో చూపిస్తుండడం వల్ల చిక్కులు, చికాకులు ఉండేవి. ఊర్లో కొంత మందికి భూమి ఉన్నా పాస్ బుక్ లు కూడా లేవు. ఈ సర్వే కారణంగా ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం లభించడం సంతోషంగా ఉంది. - ఖరీదు శ్రీనివాసరావు, రైతు, ములుగుమాడు
ప్రత్యేక టీమ్స్తో సర్వే
సర్వే కోసం ప్రతి గ్రామానికి రెండు నుంచి మూడు చొప్పున స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేశారు. ప్రతి టీమ్లో రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ డిపార్ట్మెంట్తో సర్వే బాధ్యతలు చేపడుతున్న ఏజెన్సీ నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు కలిసి ఒక టీమ్గా ఏర్పడ్డారు. రోజుకు కొన్ని సర్వే నంబర్ల చొప్పున ప్రతి కమతాన్ని సర్వే చేసి, మ్యాప్లను తయారు చేస్తున్నారు. భూమి హక్కుదారులతో పాటు నాలుగు వైపులా హద్దుల్లో ఉన్న రైతుల సమక్షంలో సర్వేను కొనసాగిస్తున్నాయి.
ఒకే భూమిపై డబుల్ రిజిస్ట్రేషన్లు, భూమి విస్తీర్ణంలో తప్పులు, ఫీల్డ్లో ఉన్న భూమి కంటే పాస్బుక్లో ఎక్కువగా నమోదు కావడం, మ్యూటేషన్ చిక్కులు లేకుండా ఈ సర్వేతో లెక్కలను సరిచేయనున్నారు. సర్వేలో భాగంగా ప్రైవేట్ భూములతో పాటు ప్రభుత్వ, దేవాదాయ, భూదాన్, అటవీ, వక్ఫ్భూములున్నా వాటి లెక్క కూడా తేల్చనున్నారు. సర్వేలో తేలిన వివరాలను, పహాణీల్లో ఉన్న వివరాలను సరిచూస్తున్నారు. రైతుల మధ్య వివాదం ఉన్న భూములు, ప్రభుత్వ శాఖల మధ్య వివాదం నడుస్తున్న భూముల విస్తీర్ణం, వివరాలను సర్వే రిపోర్ట్లో పొందుపరచనున్నారు.