రాజాసింగ్ పిచ్చిపిచ్చిగా వాగుతుండు

రాజాసింగ్ పిచ్చిపిచ్చిగా వాగుతుండు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ విమర్శలతో విరుచుకుపడ్డారు. రాజాసింగ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఖబర్దార్.. రాజాసింగ్ అని హెచ్చరించారు. ‘‘మునావర్ ఫారుఖీ ఇండియన్ కాదా ? పాకిస్థాన్ వాడా ? మునావర్ ముంబైలోనే ఉంటాడు. ఆయన ప్రాపర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే. మరి మీ ముఖ్యమంత్రులు ఏం పీకుతున్నారు ?’’ అని ఎమ్మెల్యే షకీల్ ప్రశ్నించారు. తెలంగాణను ఒక గోద్రాలా మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఈడీ, సీబీఐ ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలన్నారు. 

ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ 

ఎమ్మెల్యే రాజాసింగ్  అప్ లోడ్ చేసిన ఓ వీడియో వివాదాస్పదం కావడంతో ఆయనకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో రాత్రి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తమను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయనని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ కమిషనర్ కార్యాలయంతో పాటు భవానీ నగర్, డబీరపురా ,రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ ముందు ఓ వర్గం నేతలు ధర్నాకు దిగారు.  దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు.

ధర్మం కోసం చావడానికైనా సిద్ధమన్న రాజాసింగ్ 

తాను  ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధమని  రాజా సింగ్ వెల్లడించారు. రాముడిని కించపరుస్తూ షో చేసిన మునావర్ ఫారూఖీని హైదరాబాద్ కు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని‌ హెచ్చరించినా షో ప్రదర్శించారని అన్నారు. దండం పెట్టి వేడుకున్నా పోలీసులు వినలేదన్నారు. రాముడిని కించపరిచిన వ్యక్తికి పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారని కేటీఆర్ ను ప్రశ్నించారు. మునావర్ ఫారూఖీకి కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పానన్నారు. రెండో భాగానికి సంబంధించిన వీడియో త్వరలో అప్ లోడ్ చేస్తాననని వెల్లడించారు. యాక్షన్ కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుందని తెలిపారు. తనపై ఎలాంటి చర్యలకు దిగినా ఎదుర్కొనేందుకు రెడీ అని రాజాసింగ్ చెప్పారు.