వాషింగ్టన్: ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరించాడు. అమెరికాతో ఒప్పందం చేసుకోవడం లేదా హార్మూజ్ జల సంధిని తిరిగి ఓపెన్ చేయడానికి ఇరాన్కు తాను ఇచ్చిన 10 రోజుల గడువు సమీపిస్తోందని గుర్తు చేశాడు. సమయం మించిపోతుందని.. ఇరాన్పై ప్రళయం విరుచుకుపడటానికి కేవలం 48 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయని పేర్కొన్నాడు.
ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ట్రూత్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘ఒప్పందం కుదుర్చుకునేందుకు లేదా హోర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్కు పది రోజుల గడువు ఇచ్చా. సమయం మించిపోతోంది. వారిపై ప్రళయం విరుచుకుపడేందుకు మరో 48 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది’’ అని హెచ్చరించారు.
కాగా, గత నెల రోజులకు పైగా పశ్చిమాసియాలో సాగుతోన్న యుద్ధాన్ని ముగించేందుకు లేదా హార్మూజ్ జల సంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్కు 2026, ఏప్రిల్ 6వ తేదీ వరకు ట్రంప్ డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లోగా తమతో ఒప్పందం చేసుకోవాలని లేదంటే మరింత భీకర దాడులకు సిద్ధంగా ఉండాలని ఇరాన్కు తేల్చి చెప్పాడు ట్రంప్. తాను విధించిన గడువు సమీపిస్తుండటంతో తాజాగా మరోసారి ఇరాన్ను హెచ్చరించాడు ట్రంప్.
►ALSO READ | ఎద్దులు, దున్నపోతులపై ట్యాక్స్: ఒక్కో పశువుపై రోజుకు 30 రూపాయలు.. పాకిస్థానా మజాకా..!
సమయం మించిపోతోందని.. మరో 48 గంటలు మాత్రమే మిగిలి ఉందని డెడ్ లైన్ గుర్తు చేశాడు. ఈ లోగా ఏదో ఒకటి చేయకపోతే ఇరాన్పై ప్రళయం విరుచుకుపడుతోందని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఏ మాత్రం లెక్క చేయడం లేదు. అమెరికా డిమాండ్లకు ఒప్పుకునే సమస్య లేదని.. ఎన్ని రోజులు యుద్ధం చేయడానికైనా సిద్ధమని ఇరాన్ తేగేసి చెబుతోంది. దీంతో రానున్న 48 గంటల్లో ఏం జరగబోతుందని ప్రపంచ దేశాల్లో తీవ్ర ఉత్కంఠ, భయాందోళనలు నెలకొన్నాయి.
