పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా తలెత్తిన చమురు సంక్షోభం నేపాల్ పై పడింది. తీవ్ర పెట్రోల్, డీజిల్ కొరత ఎదుర్కొంటున్న నేపాల్.. పరిస్థితులను చక్కబెట్టేందుకు తంటాలు పడుతోంది. పెట్రోలియం ఉత్పత్తుల కొరత దృష్ట్యా నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి వారం రెండు రోజుల పాటు సెలవు ఇవ్వాలని నేపాల్ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు.ఇప్పటివరకు నేపాల్లో కేవలం శనివారం మాత్రమే వారాంతపు సెలవు ఉండేది. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై శనివారం ,ఆదివారం రెండు రోజులు సెలవు ఉంటుంది.పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెట్రోలియం సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కొత్త నిబంధన సోమవారం(ఏప్రిల్ 6, 2026)నుంచి అమలులోకి రానుంది. సెలవుల వల్ల తగ్గే పని గంటలను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వ ఆఫీసుల పని వేళలను ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5:00 వరకు మార్చారు. ఈ రెండు రోజుల సెలవు నిర్ణయం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
►ALSO READ | ఈసారి సరిహద్దుల్లో కాదు.. నేరుగా కోల్కతాపైనే అటాక్ చేస్తం: పాక్ మంత్రి బీరాలు
ఇరాన్, ఇజ్రాయెల్ -అమెరికాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ చమురురవాణా వ్యవస్థను దెబ్బతీసింది.ఇది నేపాల్లో ఇంధన కొరతకు, ధరల పెరుగుదలకు దారితీసింది. ఖాట్మండులో లీటరు పెట్రోల్ ధర ఆల్టైమ్ రికార్డు స్థాయి రూ. 202 (NPR) కు చేరుకుంది. డీజిల్ ,కిరోసిన్ ధరలు కూడా లీటరుకు రూ.182 కు పెరిగాయి.
నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ (NOC) గత 18 రోజుల్లోనే ధరలు పెంచడం ఇది మూడవసారి. గతంలో జూన్ 2022లో నమోదైన రికార్డు ధరలను (పెట్రోల్ రూ. 199) ప్రస్తుత ధరలు అధిగమించాయి. జనవరి 2026లో పెట్రోల్ ధర రూ. 156 గా ఉండేది. గడచిన 18 రోజుల్లోనే పెట్రోల్ పై రూ. 45, డీజిల్ పై రూ. 40 చొప్పున ధరలు పెరిగాయి.
