
- కేసీఆర్ మీడియా సమావేశం దర్యాప్తును ప్రభావితం చేయడమే
- ఎంక్వైరీ కాకముందే నిందితులను కుట్రదారులుగా ఎట్ల పేర్కొంటరు
- పంచనామా ఓ రోజు.. మధ్యవర్తుల సంతకాలు ఇంకోరోజు
- సిట్ అధికారి చర్యలు దురుద్దేశపూరితం
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్ కాపీ అధికారికంగా బుధవారం వెలువడింది. కేసు దర్యాప్తులో సిట్వ్యవహరించిన తీరును తప్పుపడుతూ హైకోర్టు తన 98 పేజీల తీర్పులో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంక్వైరీ జరగకముందే సీఎం మీడియా సమావేశం నిర్వహించి వీడియోలను బహిర్గతం చేయడం, నిందితులను కుట్రదారులగా పేర్కొనడం కేసు దర్యాప్తును ప్రభావితం చేయడం కిందకే వస్తుందని తెలిపింది. సిట్ అధికారి చర్యలు దురుద్దేశపూర్వకంగా ఉన్నాయన్న పిటిషనర్ల వాదనను ఆమోదించింది. మరోవైపు తీర్పు కాపీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీబీఐకీ కూడా చేరి ఉటుంది. కాపీ అందుకోవడమే తరువాయి గురువారం కేసును టేకోవర్ చేసుకునే అవకాశం ఉందని లీగల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. గురువారం పొద్దున్నే సిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసినా వెంటనే విచారణకు వచ్చే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరుతూ సిట్ డివిజన్ బెంచ్ని కోరితే.. దానిపై మధ్యంతర ఉత్తర్వులు వెలువడితేగానీ దర్యాప్తు ఆగే చాన్స్ లేదు. తీర్పు సర్టిఫైడ్ కాపీ ప్రభుత్వానికే కాకుండా సీబీఐకి కూడా అందిందని తెలుస్తోంది. దీని ప్రకారం సింగిల్ జడ్జి తీర్పు అమల్లోకి వచ్చినట్లే అవుతుంది.
పిటిషనర్ల వాదనకు ఆమోదం
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో పలు కీలక అంశాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు చెందిన వీడియోలు, ఆడియోలు వంటి కీలక సాక్ష్యాధారాల మెటీరియల్స్ సీఎం కేసీఆర్కు రాజేంద్రనగర్ ఏసీపీ అందజేశారనే పిటిషనర్ల వాదనలను సిట్ లేదా ప్రభుత్వ అడ్వొకేట్స్ ఏ దశలోనూ ఖండించలేదు. ఫిర్యాదుదారు రోహిత్రెడ్డి నుంచి చేరి ఉండొచ్చునని అదనపు ఏజీ చెప్పారు. సీఎంకు ఎవరు ఆ మెటీరియల్ ఇచ్చారో చెప్పలేదు. కౌంటర్ పిటిషన్ల్లోనూ పేర్కొనకుండా మౌనంగా ప్రభుత్వం సిట్ ఉండిపోయాయి. సిట్ లేదా రాష్ట్ర సర్కార్ రాతపూర్వకంగా ఖండించలేదు. లిఖితపూర్వక ఆరోపణలకు అదే స్థాయిలో రాత పూర్వకంగా ఖండించకపోతే వాటిని ఆమోదించినట్లుగా పరిగణించాల్సివస్తుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు పలు తీర్పులు చెప్పింది. సీఎం వీడియో రికార్డింగ్స్ను మీడియా సమావేశం ద్వారా జనంలోకి తీసుకురావడం నిందితుల హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది. నిందితులను కుట్రదారులుగా పేర్కొంటూ సీఎం మీడియా సమావేశంలో చెప్పారు. ఇది కేసు ప్రాథమిక దర్యాప్తు దశలో కీలక విషయాలు బహిర్గతం చేయడమే కాకుండా కేసు దర్యాప్తును ప్రభావితం చేయడం కిందకే వస్తుంది. ఆ మెటీరియల్స్ ఏ విధంగా బయటకు వచ్చినప్పటికీ దాని ప్రభావం కేసు దర్యాప్తుపై ఉంటుంది. నిందితులు వ్యవస్థీకృత నేరానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ మెటీరియల్ బయటకు రావడంపై సిట్, రాష్ట్ర సర్కార్ అప్రమత్తత పాటించాయి. మౌనంగా ఉండిపోయాయి. రోహిత్రెడ్డే ఇచ్చి ఉండొచ్చునని అదనపు ఏజీ చెప్పి ఈ కీలక సమాచారానికి ముసుగు వేసే ప్రయత్నం జరిగింది. దీనికి ఆధారాలు కూడా ఏమీ లేవు. అదే విధంగా కేసుకు చెందిన వీడియో, ఇతర మెటీరియల్స్తో కూడిన పెన్డ్రైవ్, సీడీలను సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు సీఎం పంపడంపై ప్రభుత్వం, సిట్ బేషరతుగా క్షమాపణలు చెప్పాయి. ఆ మెటీరియల్స్ సీఎంకు ఎలా చేరిందో సిట్/సర్కార్ చెప్పకుండా మౌనంగా ఉండిపోయాయి. మొయినాబాద్ ఫామ్హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు ఘటన అక్టోబర్ 26న జరిగితే అదే రోజు పోలీసుల పంచనామా నిర్వహించారు.
అయితే, అ పంచనామాలో మధ్యవర్తుల సంతకాలు ఆ తర్వాత రోజు అక్టోబర్ 27వ తేదీతో ఉన్నాయి. ఈ విషయాలను పిటిషనర్లు తమ రిట్లల్లో పేర్కొనలేదు. అయినా ఇది కూడా చాలా కీలక విషయం. సిట్ ఏర్పాటు జీవో 63ను రద్దు చేస్తున్నాం. జీవో 268 ప్రకారం అవినీతి నిరోధక కేసును ఏసీబీ పోలీసులే దర్యాప్తు చేయాలి. సాధారణ పోలీసులు కేసు నమోదు చేసినా దానిని ఏసీబీ పోలీసులకు బదిలీ చేయకపోవడం చట్ట వ్యతిరేకం. సిట్ దర్యాప్తు అధికారి దురుద్ధేశపూరితంగా వ్యవహరిస్తున్నారన్న పిటిషనర్ (నిందితులు) వాదనను ఆమోదిస్తున్నాం. అందుకే రాజ్యాంగంలోని 226 అధికరణం కింద లభించిన విచక్షణాధికారాన్ని వినియోగించి సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి బదిలీ చేస్తున్నాం.. అని సింగిల్ జడ్జి జస్టిస్ విజయ్సేన్రెడ్డి వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు.