కరోనా ఎఫెక్ట్.. డాక్టర్లు, నర్సులు కావలెను

కరోనా ఎఫెక్ట్.. డాక్టర్లు, నర్సులు కావలెను

హైదరాబాద్‌, వెలుగు: కాంట్రాక్ట్‌ పద్ధతిలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్ల రిక్రూట్‌మెంట్‌కు ప్రభుత్వం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది పాసైన వాళ్ల నుంచి రిటైర్డ్ అయినవాళ్ల వరకు ఎవరైనా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 3 వరకు health.telangana.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. స్పెషలిస్ట్‌ డాక్టర్లకు రూ.లక్ష, మెడికల్ ఆఫీసర్‌‌(ఎంబీబీఎస్‌)కు రూ.40 వేలు, ఆయూష్ మెడికల్ ఆఫీసర్లకు రూ.35 వేలు, స్టాఫ్ నర్సులకు రూ.23 వేలు, ల్యాబ్‌ టెక్నీషియన్లకు రూ.17 వేల చొప్పున వేతనం ఇవ్వనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఎందరొచ్చినా తీసుకోవాలని…

ప్రస్తుతం రాష్ర్టంలోని ప్రభుత్వ దవాఖాన్లలో  డాక్టర్లు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. మరోవైపు కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఊహించని స్థాయిలో కేసులు పెరిగితే ట్రీట్‌మెంట్ చేయడానికి ఇప్పుడున్న డాక్టర్లు, సిబ్బంది సరిపోరు. దీంతో భారీ రిక్రూట్‌మెంట్‌కు సర్కారు ప్లాన్ చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న 18 దవాఖాన్లలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 1,645 స్టాఫ్ నర్సల పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పుడు కాంట్రాక్ట్‌ పద్ధతిలో రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఇందులో పోస్టుల సంఖ్యను, వెకెన్సీ పొజిషన్‌ను పేర్కొనలేదు. పైగా రిటైర్డ్‌ వాళ్లకు కూడా అవకాశమిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మంది దరఖాస్తు  చేసుకుంటే, అంతమందిని తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. అయితే నోటిఫికేషన్‌లో డాక్టర్లకు ఇస్తామన్న రెమ్యూనరేషన్‌ తక్కువగా ఉందని, దీంతో ఆ పోస్టులపై ఎవరూ ఆసక్తి చూపకపోవచ్చునని పలువురు ఆఫీసర్లు అభిప్రాయపడ్డారు.

వారం రోజులుగా చెట్లపై సెల్ఫ్ క్వారంటైన్