పండుగలకు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లండి: సజ్జనార్

పండుగలకు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లండి: సజ్జనార్

హైదరాబాద్, వెలుగు: బతుకమ్మ, దసరా పండుగలకు ప్యాసింజర్లు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లాలని సంస్థ ఎండీ సజ్జనార్​సూచించారు. ప్రైవేట్​వెహికల్స్​లో వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. పండుగల కోసం ఈ నెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలను చేర్చేందుకు ఆర్టీసీ పూర్తిస్థాయిలో  ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. 

అందులో భాగంగా సోమవారం  బస్ భవన్ లో పోలీస్, ట్రాన్స్ పోర్ట్ అధికారులతో ఎండీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 20 నుంచి 23 వరకు అధిక రద్దీ ఉండే అవకాశం ఉండడంతో.. ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.  హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఏపీ, కర్నాటక, మహారాష్ట్రకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. గత దసరా కన్నా ఈ సారి దాదాపు వెయ్యి బస్సులను అదనంగా నడుపుతున్నట్లు తెలిపారు.