
- తమను విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్, బీజేపీకి లేదు: తుమ్మల
హైదరాబాద్, వెలుగు: ఎన్ని ఇబ్బందులున్నా తొమ్మిది రోజుల్లోనే రూ.9వేల కోట్ల రైతు భరోసా ఇచ్చామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సెక్రటేరియెట్ రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర నిర్వహించిన ‘రైతు నేస్తం’ సభలో తుమ్మల ప్రారంభోపన్యాసం చేశారు. 9 రోజుల్లోనే రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తామంటే కొందరు నేతలు నమ్మలేదని, కానీ సీఎం రేవంత్రెడ్డి చెప్పినట్లే చేసి చూపించారని అన్నారు. ఏడాదిలోనే రేవంత్ సర్కారు రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.
పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్త పథకాలు తెస్తున్నామని వెల్లడించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని సీఎం వికాసం వైపు తీసుకెళ్తున్నారని అన్నారు. కొంతమంది బీఆర్ఎస్, బీజేపీ నేతలు రేవంత్రెడ్డిని చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.2 లక్షల్లోపు రుణం ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని అన్నామని.. అలాగే చేశామని గుర్తుచేశారు. తమను విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్, బీజేపీ నేతలకు లేదని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రూ. 4లక్షలు రుణమాఫీ చేయాలని సవాల్ విసిరారు. ప్రజా ప్రభుత్వం మరిన్ని పథకాలు తీసుకురాబోతున్నదని చెప్పారు.