బావను చంపిన బామ్మర్దులు

బావను చంపిన బామ్మర్దులు

నూతనకల్/ఆత్మకూర్(ఎస్), వెలుగు: కుటుంబ తగాదాలతో సొంత బావను బామ్మర్దులు కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన జాదవ్ బాలకృష్ణ(35) చివ్వెంల మండల పరిధిలోని ఐలపురానికి చెందిన జలజ 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడాది కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో జలజ పుట్టింటికి వెళ్లిపోయింది. అయినప్పటికీ తరచూ ఫోన్​లో ఘర్షణ పడుతుండేవారు. శనివారం రాత్రి సైతం బాలకృష్ణ, జలజ మధ్య ఫోన్​లో గొడవ జరిగింది. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నెమ్మికల్ దండు మైసమ్మ గుడి సమీపంలో గల ఎస్సార్ పెట్రోల్ బంక్​లో బాలకృష్ణ పని చేస్తున్నాడు. శనివారం రాత్రి బంకులో పని చేస్తున్న మరో ఇద్దరు ఫ్రెండ్స్​తో కలిసి ఆఫీస్​రూమ్​లో పడుకున్నాడు. రాత్రి 1.30 గంటల సమయంలో అతని బామ్మర్దులు మేడెబోయిన అజయ్, మహేశ్​తో పాటు వారి ఫ్రెండ్​ దేశబోయిన లింగయ్య బాలకృష్ణ దగ్గరకు వెళ్లి ఘర్షణకు దిగారు. మాటా మాటా పెరగడంతో ముగ్గురూ కత్తులతో దాడి చేశారు. భయంతో బాలకృష్ణ మేనేజర్ రూమ్ లో దాక్కున్నాడు. అద్దాలు పగలగొట్టి మరీ దాడి చేయడంతో బాలకృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. మృతుని తల్లి జాదవ్ సుశీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్సై సురేశ్​రెడ్డి చెప్పారు. 

గంటన్నర గొడవ జరిగినా అడ్రస్ లేని పోలీసులు

రాత్రి1.30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎస్సార్ పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న బాలకృష్ణపై దాడి చేస్తున్నారని బంకు మేనేజర్ వెంకటేశ్వర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గంటన్నర వరకు పోలీసులు రాలేదని బంకులో పని చేస్తున్నవాళ్లు, మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఫోన్ చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే బాలకృష్ణ ప్రాణాలతో బయటపడేవాడని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.