
- ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి
- ఏడుగురు గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ
- చార్ ధామ్ యాత్రకు బ్రేక్
న్యూఢిల్లీ/ఉత్తరకాశీ: ఉత్తర భారతంలో వానలు దంచికొడుతున్నాయి. ఉత్తరాఖండ్, జార్ఖండ్, సిమ్లా, ఢిల్లీ, పంజాబ్ లో గత కొద్ది రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరకాశీలో ఆదివారం భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఇద్దరు కార్మికులు చనిపోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. యమునోత్రి నేషనల్ హైవే సమీపంలోని ఓ హోటల్ ను నిర్మిస్తున్నారు. కన్ స్ట్రక్షన్ సైట్లోనే ఉంటున్న 9 మంది కార్మికులు ఈ ఘటనలో గల్లంతయ్యారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 20 మంది కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. గల్లంతయిన వారిలో ఇద్దరి మృతదేహాలు తిల్హాది షహీద్ స్మారక్ సమీపంలో గుర్తించారు. ఉత్తరకాశీలోనే భారీ వానలకు నేషనల్ హైవే కొట్టుకుపోయింది. దీంతో ఇక చార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. యమునోత్రి నుంచి తిరిగివస్తున్న యాత్రికులు అక్కడే ఉండాలని, రోడ్డు మరమ్మతులు పూర్తయ్యే వరకు తిరిగి రావొద్దని అధికారులు సూచించారు.
హిమాచల్ లో సిమ్లా, కల్కా రైల్వే లైన్ కట్
హిమాచల్ ప్రదేశ్లో గత పది రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సోలాన్ జిల్లాలోని యునెస్కో గుర్తింపు పొందిన సిమ్లా, కాల్కా రైల్వే లైన్పై ఆదివారం బండరాళ్లు, చెట్లు పడడంతో ఆ మార్గాన్ని అధికారులు బంద్ చేశారు. దీంతో పలు రైళ్లు రద్దయ్యాయి. ఇదే జిల్లాలో ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది. సిమ్లా, కాల్కా నేషనల్ హైవే5పై కొండచరియలు విరిగిపడడంతో హైవే డ్యామేజ్ అయింది. గత పది రోజులుగా కురుస్తున్న వానలకు ఇప్పటివరకూ 17 మంది చనిపోయారు. జార్ఖండ్లోనూ గత కొద్ది రోజులుగా భారీగా వానలు కురుస్తున్నాయి. ఈస్ట్ సింగ్ భూమ్ జిల్లాలోని పండార్ సోలిలో ఓ ప్రైవేటు స్కూల్ లో చిక్కుకున్న 162 మంది స్టూడెంట్లను పోలీసులు ఆదివారం రక్షించారు.
ఢిల్లీకి 2 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు
రుతుపవనాలు ఢిల్లీలో 2 రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. ఢిల్లీతో పాటు రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానాలోనూ రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో దేశవ్యాప్తంగా రుతుపవనాలు 9 రోజుల ముందే వ్యాప్తి చెందాయి. కాగా.. చండీగఢ్లో గత 24 గంటల్లో 11.95 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఫిరోజ్ పూర్, మొహాలి, పటియాలా, పఠాన్ కోట్, రూపనగర్ లోనూ రికాం లేకుండా వర్షాలు కురిశాయి.