సీఎం షిండేకు ఉద్ధవ్ ఠాక్రే సవాల్

సీఎం షిండేకు ఉద్ధవ్ ఠాక్రే సవాల్

మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. వెంటనే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి మీడియాతో మాట్లాడిన ఉద్ధవ్.. ఎలక్షన్ పెడితే జనం ఎవరివైపు ఉన్నారో తేలిపోతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రెబల్ ఎమ్మెల్యేలను శివసేన పార్టీ గుర్తుపై పోటీ చేయనిచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.

మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలే తీర్పు చెబుతారని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ తను తప్పు చేసి ఉంటే ప్రజలే తనను ఇంటికి సాగనంపుతారని అన్నారు. వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టాలనుకునుకుంటే రెండున్నరేళ్ల క్రితమే చేసి ఉండాల్సిందని అన్నారు. శివసేన పార్టీ గుర్తును ఎవరూ తన నుంచి తీసుకోలేరన్న ఉద్ధవ్ జనం కేవలం పార్టీ సింబల్ చూసి ఓటేయరని, అది ఎవరి దగ్గరుందన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారని అన్నారు.

శివసేన రెబల్ ఎమ్మెల్యేలపైనా ఉద్ధవ్ ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు తనతో పాటు తన కుటుంబాన్ని టార్గెట్ చేసినా ఎవరూ నోరు మెదపలేదని మండిపడ్డారు. బీజేపీ వారితో కలిసి సొంత పార్టీనే వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.