ప్రతీ ఆడపిల్ల తాను చేసుకోబోయే వరుడి గురించి, తన వైవాహిక బంధం గురించి పెళ్ళి ముందే ఎన్నో కలలు కంటుంది. పెళ్లి తంతులో తాను ధరించబోయే చీరలు,నగలు.. ఇలా ఎన్నో రకాలుగా ప్లాన్ చేసుకుంటుంది. అందుకు కులం, మతం, భాష, ప్రాంతం అతీతం. అలా ఎంతో ఘనంగా అందరికీ గుర్తుండిపోయేలా పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ యువతికి… చివరకి దు:ఖమే మిగిలింది. ఆమె ప్రేమించి, పెళ్లాడబోయే వ్యక్తి మోసగాడని తెలిసింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది.
యూకే లోని అబర్డేర్ కు చెందిన రోసన్నా థామస్(25) గెవిన్ హల్ అనే వ్యక్తి ప్రేమలో పడింది. అతడు చెప్పిన మాటలకు, చేసిన ప్రామిస్ లకు పొంగిపోయింది. అతనితో శారీరకంగా కలిసింది. ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత గెవిన్.. చాలా ఘనంగా పెళ్లి చేసుకుందామని, పెళ్లి తర్వాత ఓ కొత్త ఇంట్లో కాపురం పెడదామని ఆమెను నమ్మించాడు. మరో నాలుగు రోజుల్లో పెళ్లి ఉందని, అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, పెళ్లి మండంపం బుక్ చేయాలని రోసన్నా దగ్గర 10,000 వేల పౌండ్లు(రూ.8,75,300) తీసుకున్నాడు.
పెళ్లి కోసం అతిథులను అందర్నీ ఆహ్వానం పంపిన తర్వాత, రోసన్నా తన ఫోటో గ్రాఫర్ కి కాల్ చేయగా అసలు విషయం బయట పడింది. తాము బుక్ చేసుకున్నామనుకుంటున్న ఆ వేదిక లో ఎలాంటి పెళ్లిళ్లు జరగవని, ఆ వెన్యూ పెళ్లి వేడుకల కోసం కాదని తెలిసింది. ఫోటో గ్రాఫర్ చెప్పిన విషయం కన్ఫామ్ చేసుకోవడానికి ఫంక్షన్ హాల్ కి కాల్ చేయగా… రోసన్నా, గెవిన్ పేరుతో ఎలాంటి బుకింగ్స్ జరగలేదని తెలిసింది.
ఈ విషయం గురించి రోసన్నా.. గెవిన్ ను నిలదీయగా తాను పేమెంట్ చేశానని , ఓ బ్యాంకు స్టేట్ మెంట్ చూపించాడు. అది కూడా ఫేక్ అని తేలడంతో అతన్ని అసహ్యించుకొని ఆ పెళ్లిని తానే వద్దనుకుంది. తాను తొలిప్రేమలో పడి, అతడిని గుడ్డిగా నమ్మి మోసపోయానని తెలిపింది. పెళ్లి కోసం అప్పు కూడా చేశానని, అసలు అదంతా ఫేక్ అని తేలడంతో.. పెళ్లికి కొన్న బట్టలను, బూట్లను అమ్మకానికి పెట్లానని వాపోయింది రోసన్నా.

