
- మంత్రి ఉత్తమ్ లేఖలకు కేంద్ర మంత్రి సీఆర్పాటిల్ ఆన్సర్
- తెలంగాణ ఆందోళనను అర్థం చేసుకున్నాం
- ప్రపోజల్స్ అందాకే చర్యలు తీసుకుంటామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: బనకచర్లపై తెలంగాణ ఆందోళనను అర్థం చేసుకున్నామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డిటెయిల్డ్ ప్రపోజల్ ఏదీ తమకు ఇంకా అందలేదని పేర్కొన్నారు. ఈ మేరకు బనకచర్ల–గోదావరి లింక్ (జీబీ లింక్) ప్రాజెక్ట్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ ఏడాది జనవరి 22న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లేఖకు.. మే 28న సీఆర్ పాటిల్ బదులిస్తూ లేఖ రాశారు.
తాజాగా శుక్రవారం ఆ లేఖను మంత్రి ఉత్తమ్ బయటపెట్టారు. ‘‘జీబీ లింక్ ప్రాజెక్టుపై ఏపీ ఇంకా ఎలాంటి డిటెయిల్డ్ ప్రపోజల్ ఇవ్వలేదు. అది వచ్చాక క్షుణ్నంగా పరిశీలిస్తాం. నా మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)తో గైడ్లైన్స్కు అనుగుణంగా పరిశీలన చేయిస్తాం. ట్రిబ్యునల్ అవార్డులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ఏపీ విభజన చట్టంలోని అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం. దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అని వివరించారు.
కాగా, ఏపీ గత నెల 23నే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి సమర్పించినట్టు తెలిసింది. అయినా తమ వద్దకు ఇంకా ఎలాంటి ప్రపోజల్ రాలేదని కూడా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చెప్పడం వెనుక ఆంతర్యమేంటన్న చర్చ జరుగుతున్నది.