
‘సార్, ఆన్లైన్ లో మందు అమ్మాలనే మా డిమాండ్ని ఫీడ్ బ్యాక్ గా రికార్డు చేసుకోండి’.
‘మా పెట్ స్నూపీకి క్వాలిటీ ఫుడ్ కావాలె, సిటీలో ట్రావెల్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వండి’
‘వైన్స్ ఎప్పుడు ఓపెన్ చెస్తారో జర చెప్పండి సార్’
‘మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. సిలిండర్ బుక్ చేశాం. తొందరగా పంపించండి.’
లాక్ డౌన్తో గ్రేటర్ జనం ఇబ్బంది పడకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం ఏర్పాటు చేసిన కోవిడ్–19 కంట్రోల్ రూమ్స్కు వచ్చిన కాల్స్ ఇవి. ఇలాంటి పొంతలేని కాల్స్ సిబ్బందిని పరేషాన్ చేస్తున్నాయి.
హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్లో నిత్యావసరాలు, హెల్త్ ఎమర్జెన్సీ కోసం గ్రేటర్లోని 3 కమిషనరేట్లలో కోవిడ్–19 కంట్రోల్ రూమ్స్ 24 గంటలూ పనిచేస్తున్నాయి. గత నెల 23 నుంచి దాదాపు లక్షా 6వేల కాల్స్ ను సిబ్బంది రిసీవ్ చేసుకున్నారు. వాటిల్లో పొంతనలేని, అనవసరమైన కాల్స్ ఇబ్బంది పెడుతున్నట్లు కంట్రోల్ రూం సిబ్బంది చెప్తున్నారు. ఇంట్లో పశువులకు గడ్డి తెచ్చేందుకు ట్రావెల్ పాస్లు ఇవ్వాలని ఒకరు.. వాటర్ వర్క్స్ నంబర్ బిజీ వస్తోంది, వాళ్లకు ఫోన్ చేసి మా ఏరియాకు నీళ్లు సప్లయ్ చేయమని చెప్పండంటూ మరొకరు.. సంబంధం లేని పనులకు కాల్ చేస్తున్నారని వాపోతున్నారు. ఇటీవల ఓ మహిళ స్ట్రీట్ డాగ్స్కు ఫుడ్ పెట్టాలని ఒకే రోజు10సార్లు ఫోన్ చేసినట్లు తెలిపారు. అలాంటి కాల్స్తో ఎమర్జెన్సీ సర్వీస్కు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సగం కాల్స్ ట్రావెల్ పాస్ల కోసమే..
కంట్రోల్ రూమ్స్ సిబ్బంది ఎమర్జెన్సీ సర్వీసెస్, ఫుడ్ రిలేటెడ్ కాల్స్ ను సంబంధిత పోలీస్ స్టేషన్స్ తో కో ఆర్డినేట్ చేసుకుంటున్నారు. హెల్త్ ఎమర్జెన్సీ టైమ్లో లోకల్ పెట్రో కార్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాధితులను హాస్పిటల్స్ కి షిఫ్ట్ చేస్తున్నారు. స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెట్టాలంటూ వస్తున్న కాల్స్ను లోకల్ ఎన్జీవోస్కు ట్రాన్స్ ఫర్ చేసి వాటి ద్వారా ఫుడ్ అందిస్తున్నారు. మేజర్గా ట్రావెలింగ్ పాస్ల కోసం 50 శాతం, నిత్యావసరాలకు 30 శాతం, మెడికల్ ఎమర్జెన్సీకి 10 శాతం, వలస కార్మికుల నుంచి మరో మరో 10 శాతం కాల్స్ వస్తున్నాయి. జనం గుంపులుగా ఉన్నారని, మాస్క్ లేకుండా తిరుగుతున్నారని కొందరు సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఫోన్ చేస్తున్న వాళ్లూ ఉన్నారు.