హైదరాబాద్, వెలుగు: భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నైతిక విలువలకు కట్టుబడిన మహోన్నతమైన వ్యక్తి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కొనియాడారు. వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ దేశాభివృద్ధికి వాజ్పేయి వేసిన పునాదులు చిరస్మరణీయమన్నారు. ఆయన పాలన భారత చరిత్రలో ఒక సువర్ణయుగమని అభివర్ణించారు. జాతీయ రహదారుల నిర్మాణం, టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు, సామాన్యుడికి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ అందించడం వంటి నిర్ణయాలు దేశ ముఖచిత్రాన్ని మార్చేశాయని చెప్పారు. పార్లమెంటులో కేవలం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కోల్పోయే పరిస్థితి వచ్చినా.. విలువలకు కట్టుబడి పదవి నుంచి తప్పుకున్న మహోన్నత వ్యక్తి అటల్ జీ అని ప్రశంసించారు.
