ఆన్‌లైన్‌ ద్వారా శ్రీవారి కల్యాణోత్సవ సేవ

ఆన్‌లైన్‌ ద్వారా శ్రీవారి కల్యాణోత్సవ సేవ
  • కరోనా కారణంగా మొదటిసారి ప్రవేశపెట్టిన తితిదే

తిరుమల: కలియుగ దైవం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి ఆల‌యంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీ‌వారి క‌ల్యాణోత్సవాన్ని ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించేందుకు తితిదే నిర్ణయించింది. కరోనా కారణంగా, భక్తుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఈ నెల 7 నుంచి 31 వరకు ఈ విధంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. దాని కోసం 6వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. టికెట్లు కావాల్సిన వారు www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని చెప్పారు. గేట్‌వే ద్వారా రూ.వెయ్యి చెల్లించి ఆన్‌లైన్‌ రసీదు పొందాలని అన్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 12.00 గంటలకు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. కల్యాణోత్సవంలో పాల్గొనే వారు సంప్రదాయ దుస్తులు ధరించి, పూజార్ల సూచన మేరకు తమ గోత్ర నామాలతో సంకల్పం చెప్పుకోవాలని అన్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన వారి గోత్ర నామాలు పూజా సమయంలో స్వామికి నివేదిస్తారని అధికారులు చెప్పారు. ఈ సేవ‌లో పాల్గొనే భ‌క్తుల‌కు ఉత్తరియం, ర‌విక‌, అక్షింత‌లు ప్రసాదంగా ఇండియా పోస్టల్ ద్వారా పంపుతామని చెప్పారు.
టికెట్లు బుక్ చేసుకునే విధానం –
– ముందుగా www.tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాలి. – ఆన్‌లైన్‌లో క‌ల్యాణోత్సవం (ఆన్‌లైన్ పార్టిసిపేషన్) అనే బటన్ ని క్లిక్ చేయాలి. ఇక్కడ టిటిడి పొందుపరిచిన సూచనలను అంగీకరిస్తూ I Agree అనే బాక్స్‌ లో టిక్ గుర్తు పెట్టాలి. – ఆ తర్వాత క‌ల్యాణోత్సవం తేదీని,  గృహస్తుల(ఇద్దరు) పేర్లు, వయసు, లింగం, గోత్రం, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ప్రసాదాలు పంపిణీ కోసం చిరునామా వివరాలు పొందుపరచాలి. – ఈ సమాచారాన్ని సరిచూసుకొని కంటిన్యూ అనే బటన్ నొక్కితే పేమెంట్ పేజి వస్తుంది. ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాకింగ్‌ ద్వారా సదరు టికెట్ మొత్తాన్ని చెల్లించవచ్చు. పేమెంట్ పూర్తయిన అనంతరం టికెట్ ఖరారవుతుంది.