ఎడ్లబండిపై గురువు... బండిలాగిన విద్యార్థులు

ఎడ్లబండిపై గురువు... బండిలాగిన విద్యార్థులు

ఉపాధ్యాయుడికి ఓ ఊరు ఊరంతా ఘన సన్మానం చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో బదిలీపై వెళ్తున్న ప్రధానోపాధ్యాయుడిని ఊరువాడ ఏకమై ఘనంగా సన్మానించారు. రోజంతా ఆయనతో కలిసిపోయిన గ్రామస్ధులు, విద్యార్థులు సాయంత్రం వేళ ఎడ్లబండిపై ఎక్కించి గ్రామం పొలిమేర వరకు సాగనంపారు. గురువును ఎక్కించిన ఎడ్లబండిని పూర్వ విద్యార్థులే లాగుతూ తమ గురుభక్తిని చాటుకున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు మండలం వెనుకతండాలో  ఈ ఘటన చోటు చేసుకొంది. ఇక్కడి ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోనిమియా సాహెబ్ బదిలీ కాగా అతన్ని ఘనంగా సన్మానించాలని గ్రామస్థులంతా భావించారు. ప్రధానో పాధ్యాయుడిని, అతని సతీమణిని గ్రామం వెలుపల నుంచి పూలు చల్లుకుంటూ పాఠశాలకు తీసుకొచ్చారు. తర్వాత శాలువాలు కప్పి, చిరు కానుకలు అందజేసి సన్మానించారు. అంతా కలిసి సామూహిక భోజనాలు చేశారు. గురువులతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన ఇక్కడ పనిచేసిన తొమ్మిదేళ్లలో సుమారు 25 మంది విద్యార్థులను గురు కులాలకు పంపారు. గ్రామస్థుల అభిమానానికి సోనిమియా సాహెబ్ ఆనంద వ్యక్తం చేశారు.