కోల్కతా: డే నైట్ టెస్ట్ ఆడడానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడు సెకండ్లలోనే తన అంగీకారాన్ని తెలిపాడని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు.నవంబర్ 22–26 మధ్య ఇండియా, బంగ్లాదేశ్ జట్లు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాయి. ఇరుజట్లకు పింక్బాల్తో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. కోల్కతాలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ.. గత నెల 24న సెలెక్షన్ కమిటీ మీటింగ్కు ముందు కోహ్లీతో జరిగిన చర్చలో పలు అంశాలను వెల్లడించాడు. ‘అడిలైడ్లో డే నైట్ టెస్ట్ ఆడడానికి గతేడాది ఎందుకు నిరాకరించామో నిజంగా నాకు తెలీదు. 24వ తేదీన విరాట్తో ఓ గంట సేపు పలు అంశాలపై మాట్లాడా. మనం ఓ డే నైట్ టెస్ట్ ఆడాలని మొదటిప్రశ్నగా అడిగా, అందుకు మూడు సెకన్లలోనే ఓకే అంటూ కోహ్లీ తలాడించాడు. డే నైట్ మ్యాచ్లు టెస్ట్ క్రికెట్కు గత వైభవాన్ని తీసుకువస్తాయి. నాతోపాటు కోహ్లీ కూడా అదే నమ్మకంతో ఉన్నాడు అని’ గంగూలీ తెలిపాడు.
