సంగారెడ్డి జిల్లా : కరోనా వైరస్ తో మృతిచెందిన ఓ వృద్ధుడి అంత్యక్రియలను అధికారులెవ్వరికీ తెలియనివ్వకుండా జరిపించారు మృతుడి కుటుంబ సభ్యులు. అయితే అంత్యక్రియల్లో పాల్గోన్న వారికి వైరస్ లక్షణాలు కనిపించడంతో మృతుడి కుటుంబీకుల్లో ఆందోళన నెలకొంది. సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ మండలం రొయ్యల గూడెం కు చెందిన రొయ్యల నర్సింలు అనే వృద్ధుడు కరోనా పాజిటివ్ తో మృతి చెందాడు. అయితే అతని కుటుంబ సభ్యులు ఏ అధికారులకు,స్థానికులకు తెలుపకుండా ఈ నెల 6వ. తేదీనాడు తమ గ్రామంలో వృద్ధుడి అంత్యక్రియలు పూర్తి చేశారు.
అయితే మృతుని కుటుంబీకుల్లో దగ్గు, జలుబు లాంటి వైరస్ లక్షణాలు కనిపించడంతో అనుమానంతో హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లి కోవిడ్ -19 పరీక్షలు చేయించుకున్నారు. కుటుంబసభ్యుల్లో హైదరాబాద్ జేఎన్టీయూ లో స్టేషన్ అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న నరేష్ అనే యువకుడికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. మరో ఇద్దరు వ్యక్తులు సంతోష్,మహేష్ ల రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. ఈ విషయం బయటపడడంతో మృతుడి అంత్యక్రియల్లో ఎవరెవరు పాల్గొన్నారు అనే సమాచారాన్ని అధికారులు సేకరించే పనిలో పడ్డారు.