సెల్ ఫోన్ పక్కన పెడితే కొలువు మీదే

సెల్ ఫోన్ పక్కన పెడితే కొలువు మీదే
  • వరంగల్ సీపీ డా.తరుణ్​ జోషి

వరంగల్​క్రైం, వెలుగు: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కొద్దిరోజులు సెల్ ఫోన్ దూరం పెడితే కొలువు సాధించడం సులువవుతుందని వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి అన్నారు. పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్​అవుతున్న వారికి ఫ్రీ కోచింగ్​ ఇచ్చేందుకు వరంగల్​ కమిషనరేట్​ ఆధ్వర్యంలో ఎంట్రన్స్​ టెస్ట్​ నిర్వహించి వరంగల్​, హనుమకొండ డివిజన్ల​ నుంచి మొత్తంగా 500 మందిని ఎంపిక చేశారు. హనుమకొండ డివిజన్​ నుంచి ఎంపికైన 250 మందికి సుబేదారి ఆర్ట్స్​ కాలేజీ, వరంగల్ డివిజన్​ లో ఎంపికైన 250 మందికి ఎల్​ బీ కాలేజీలో కోచింగ్​ఇవ్వనున్నారు. 80 రోజుల పాటు కొనసాగనున్న ఈ ఫ్రీ కోచింగ్​ క్లాస్​లను మంగళవారం సీపీ  డా.తరుణ్ జోషి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ  నిబద్ధతతో చదివితే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చాన్నారు. ముఖ్యంగా ఓ ప్లాన్​ ఏర్పాటు చేసుకోవాలని, తరువాత సమయం వృథా చేయకుండా చదువుకోవాలన్నారు. కోచింగ్​ సమయంలో  సిలబస్ పై  ఎలాంటి సందేహాలున్నా వాటిని వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పా రెడ్డి, హనుమకొండ, వరంగల్​ ఏసీపీ జితేందర్ రెడ్డి, గిరికుమార్​, సుబేదారి, హనుమకొండ, మట్వాడా, కేయూసీ, మహిళా పీఎస్​ సీఐలు రాఘవేందర్, వేణుమాధవ్, గణేశ్​, జనార్ధన్​ రెడ్డి, సతీష్,  పీజేఆర్​  కోచింగ్  సెంటర్ డైరెక్టర్ జగదీశ్వర్  పాల్గొన్నారు.