
హైదరాబాద్: 2025, సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం (జూన్ 25) ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితమే లోకల్ బాడీ ఎన్నికలు జరగాల్సిందని.. కానీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు పోవాలనుకోవడంతో ఆలస్యమైందన్నారు. ఎస్సీ, బీసీ వర్గీకరణ చేసి కేంద్రానికి పంపించామని.. అక్కడ పెండింగ్లో ఉందన్నారు.
ఈ విషయంలో ఒక్క బీజేపీ మంత్రి కూడా నోరు మెదపడం లేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ 18 నెలల్లోనే చేసిందన్నారు. రాష్ట్రంలో పరిపాలన అద్భుతంగా సాగుతుంటే బీఆర్ఎస్ అభూత కల్పనలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన సామాజిక న్యాయం ఏ ప్రభుత్వంలోనూ జరగలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎన్నికల కోసం మాత్రమే పథకాలు తీసుకొచ్చేదని విమర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చారని ఆరోపించారు. రాష్ట్ర హక్కులను గత ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు.