టీఎస్​పీఎస్సీ ప్రతిష్టను పెంచుతాం : చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడి 

టీఎస్​పీఎస్సీ ప్రతిష్టను పెంచుతాం : చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడి 
  •  చైర్మన్​గా బాధ్యతల స్వీకరణ 
  • కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం 

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్​పీఎస్సీ) ప్రతిష్టను పెంచేలా పనిచేస్తామని కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. టీఎస్​పీఎస్సీ చైర్మన్​గా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కమిషన్ కొత్త సభ్యులు అనితా రాజేంద్ర, ప్రొఫెసర్ యాదయ్య, పాల్వాయి రజనీకుమారితో ఆయన ప్రమాణం చేయించారు. తర్వాత కమిషన్ ఆఫీసులో జాతీయ జెండా ఎగురవేసి, గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే సందర్భంగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

టీఎస్​పీఎస్సీ అధికారులు, సిబ్బంది ఒక టీమ్​గా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తరతమ భేదాలు లేకుండా, అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు సర్కారు నిర్ణయించే గైడ్​లైన్స్​కు అనుగుణంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి చేసేందుకు కృషి చేద్దామన్నారు. భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఈ బాధ్యతను ప్రజలు మెచ్చేవిధంగా నిర్వర్తించేలా ప్రతిన బూనాలని సభ్యులను కోరారు. రాబోయే కాలంలో కమిషన్ వేసే ప్రతి అడుగు సంస్థ ప్రతిష్టను పెంచేలా, ప్రజల ఆశయాలను నెరవేర్చే విధం గా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఎస్​పీఎస్సీ సెక్రటరీ అనితా రాంచంద్రన్, కమిషన్ మెంబర్ అరుణకుమారి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.