- చికెన్ నెక్ భద్రత కోసం 120 ఎకరాలు బదిలీ.. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయం
- దీంతో రైల్వే విస్తరణ, భూగర్భ ట్రాక్ల నిర్మాణానికి మార్గం సుగమం
- ఈశాన్య రాష్ట్రాలకు రక్షణ, సరుకు రవాణా మరింత బలోపేతం
న్యూఢిల్లీ: భారత్ను ఈశాన్య రాష్ట్రాలతో కలిపే అత్యంత వ్యూహాత్మక చికెన్ నెక్ కారిడార్(సిలిగురి కారిడార్) లోని 120 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తున్నట్లు వెస్ట్ బెంగాల్ సర్కార్ ప్రకటించింది. అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించింది. దీంతోపాటు 7 నేషనల్ హైవేలను కేంద్ర సంస్థలైన ఎన్హెచ్ఏఐ, ఎన్హెచ్ఐడీసీఎల్కు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
అయితే, భూమి బదిలీ వెనుక ప్రధాన లక్ష్యం.. సిలిగురి కారిడార్లో భారీ రైల్వే విస్తరణ ప్రాజెక్టు అమలు చేయడమేనని తెలుస్తోంది. ఇప్పుడున్న డబుల్ ట్రాక్ రైల్వే మార్గాన్ని ఆరు ట్రాక్ల వ్యవస్థగా అభివృద్ధి చేయాలని కేంద్రం ప్రణాళిక రూపొందించింది. ఈ కొత్త ట్రాక్లలో 2 భూగర్భ మార్గాలను నిర్మించనున్నారు.
టీన్ మైల్ హాట్ నుంచి రంగపాని స్టేషన్ల మధ్య 40 కిలోమీటర్ల పొడవున 24 మీటర్ల లోతులో అండర్గ్రౌండ్ రైల్వే ట్రాక్ నిర్మించనున్నారు. దీనివల్ల యుద్ధ పరిస్థితులు, వైమానిక దాడులు, ఇతర ముప్పుల నుంచి రక్షణ సరఫరా వ్యవస్థకు సేఫ్టీ లభిస్తుందని చెబుతున్నారు.
కేంద్రం పరిధిలోకి ఏడు హైవేలు
బెంగాల్ ప్రభుత్వం బదిలీ చేయనున్న 120 ఎకరాల భూమిని ఇండియా–-బంగ్లాదేశ్ బార్దర్ వెంబడి కంచె నిర్మాణం, భద్రతా మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నారు. గతంలో పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనలకు ప్రస్తుతం బెంగాల్లో బీజేపీ సర్కారు ఏర్పడిన తర్వాత గ్రీన్ సిగ్నల్ పడింది.
ప్రభుత్వ నిర్ణయంతో ఇంతకాలం రాష్ట్ర ప్రజాపనుల శాఖ ఆధ్వర్యంలో ఉన్న డార్జిలింగ్, సిక్కిం బార్డర్, భూటాన్ బార్డర్, బంగ్లాదేశ్ సరిహద్దు మార్గాలతోపాటు మొత్తం ఏడు హైవే రూట్లు ఎన్హెచ్ఏఐ, ఎన్హెచ్ఐడీసీఎల్ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఈ హైవేల అభివృద్ధితో సిక్కిం, భూటాన్, బంగ్లాదేశ్ బార్డర్ ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు, డార్జిలింగ్, డూవార్స్, ఉత్తర బెంగాల్ ప్రాంతాలు జాతీయ రహదారి నెట్వర్క్తో మరింత బలంగా అనుసంధానమవుతాయి.
మాల్దా, ముర్షిదాబాద్, నాడియా, ఉత్తర 24 పరగణాల మీదుగా ఇండో–-బంగ్లాదేశ్ సరిహద్దు వరకు రహదారి వ్యవస్థ బలోపేతం అవుతుందని అధికారులు చెప్తున్నారు. హైవేల విస్తరణ, మరమ్మతులు, మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని, రక్షణ దళాల రాకపోకలు, వాణిజ్య రవాణా, పర్యాటక రంగాలకు పెద్ద ఎత్తున లాభం చేకూరుతుందని భావిస్తున్నారు.
