
న్యూఢిల్లీ: పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్తున్నా.. ప్రధాని మోదీ ఎందుకు స్పందించట్లేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. 20 రోజుల్లో 9 సార్లు ట్రంప్ ఈ విషయం చెప్పారని ఆ పార్టీ ఎంపీ జైరాం రమేశ్ పేర్కొన్నారు. తాజాగా, భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించి అణు విపత్తును నివారించానని ట్రంప్ మళ్లీ ప్రకటించడంతో జైరాం రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్లతో వాణిజ్యాన్ని తెగతెంపులు చేసుకుంటామని బెదిరించడంతో ఆ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ‘‘డొనాల్డ్ భాయ్’’ పదే పదే చేస్తున్న కామెంట్లపై మోదీ మౌనం వీడాలని ఆయన డిమాండ్ చేశారు.