
భర్తను హత్య చేసిన కేసులో భార్య, ఆమె ప్రియుడిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీదర్ రావు వివరాలు తెలిపారు. చైతన్యపురి యాదవ్ నగర్ లో ఉండే భానవత్ దొల్య అలియాస్శంకర్(33) నల్గొండ జిల్లా, దేవత్ పల్లి తండా వాసి. ఏడాది క్రితం భార్య విజయ, ఇద్దరు పిల్లలతో నగరానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నారు. అయితే విజయకు సపావత్ కిషన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. వారిద్దరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని ఇద్దరూ కలిసి చంపాలని పథకం పన్నారు. వేసవి సెలవులు రావడంతో పిల్లలను విజయ ఊరికి పంపింది. ఏప్రిల్28న రాత్రి 10 గంటల సమయంలో కిషన్ ను ఇంటికి పిలిపించింది. భర్త శంకర్ కు మద్యం తాగించింది. స్పృహ కోల్పాయాక ప్రియుడితో కలిసి గొంతు నులిమి హత్య చేసింది. కరెంట్ షాక్ కొట్టి శంకర్ చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. చివరికి పోలీసులకు చిక్కారు. విజయ, కిషన్లను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు.